MLA Sanjay Kumar
MLA disqualification case : తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు ఊరట లభించింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్ ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టేశారు. సంజయ్ పై అనర్హత కోరుతూ బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ కొట్టేస్తూ ప్రసాద్ కుమార్ తీర్పునిచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారని అనడానికి సరైన ఆధారాలు లేవని స్పీకర్ పేర్కొన్నారు.
పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ వరుసగా నిర్ణయాలు వెలువరిస్తున్నారు. మొత్తం 10మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవ్వగా.. ఇప్పటి వరకు ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చారు. తాజాగా.. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కు కూడా క్లీన్చిట్ ఇవ్వడంతో మొత్తం ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్చిట్ ఇచ్చినట్లయింది.
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం స్పీకర్ విచారణ చేయనుండగా.. కడియం శ్రీహరితోపాటు వివేకానంద తన వాదనలను వినిపించనున్నారు. ఇరువురి వాదనల విన్న తరువాత స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారంపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.