AP-Telangana Boarder: సరిహద్దుల్లో ఆంక్షలు.. హైవేపై వాహనాల ట్రాఫిక్ జామ్!
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి.
- Naresh Mannam
- Published On : May 12, 2021 / 12:34 PM IST
Ap Telangana Boarder Restrictions On Borders Vehicle Traffic Jam On The Highway
AP-Telangana Boarder: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుండడంతో ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రాలు వైరస్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేయకపోయినా మధ్యాహ్నం 12 గంటల నుండి పలు జిల్లాలో తీవ్ర ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే ఇతర రాష్ట్రాల నుండి ఏపీలోకి వచ్చే వాహనాలకు సైతం మధ్యాహ్నం 12 గంటల వరకే అనుమతిస్తున్నారు. సమయం మించిన తర్వాత సరిహద్దులకు వచ్చే వాహనాలను ఏపీ పోలీసులు వెనక్కు పంపిస్తున్నారు.
Ap Telangana Boarder (2)
ఇక, మరోవైపు తెలంగాణలో ఈ ఉదయం 10 గంటల నుండి పూర్తిస్థాయి లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. దీంతో తెలంగాణకు వచ్చే వాహనాలను సైతం సరిహద్దులలో పది గంటల తర్వాత వచ్చే వాహనాలను అనుమతించడం లేదు. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ ప్రకటనతో నిన్న నుండి ఏపీకి వెళ్లే వారి సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయిది. మంగళవారం రాత్రి నుండి ఏపీవైపు వెళ్లే రహదారులు కిక్కిరిసి కనిపించాయి. కానీ, ఏపీలో రాత్రి కర్ఫ్యూతో ఏపీకి వెళ్లే వాహనాలకు సరిహద్దులో బ్రేక్ పడింది.
Ap Telangana Boarder (3)
వీరికి తోడుగా బుధవారం ఉదయం హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లేవారికి సరిహద్దులో ఇక్కట్లు తప్పలేదు. మధ్యాహ్నం 12 వరకే ఏపీలోకి అనుమతి ఉండగా ఆ తర్వాత వచ్చిన వాహనాలను సరిహద్దులో నిలిపివేశారు. మరోవైపు ఉదయం 10 గంటలకే తెలంగాణ రాష్ట్రం వైపు వాహనాలను సరిహద్దులో నిలిపివేశారు. ఫలితంగా ఇరు రాష్ట్రాల వైపు, రహదారికి రెండు వైపులా వాహనాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోకి వెళ్లే వాహనాలతో విజయవాడ హైదరాబాద్ హైవే నిండిపోయింది.
అత్యవసర వాహనాలు, ట్రాన్స్ పోర్ట్ వాహనాలను, అనుమతి పొందిన వాహనాలకు అన్ని వేళల అనుమతిస్తున్న ఇరు రాష్ట్రాలు మిగతా వాహనాలను వెనక్కు పంపిస్తున్నారు. అయితే, ప్రజలు వెనక్కు వెళ్లేందుకు ఇష్టపడకపోవడంతో సరిహద్దులో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోతున్నాయి. మరోవైపు తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారితో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ తో పాటు మిగతా రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు బుధవారం ఉదయం కిక్కిరిసి కనిపించాయి. బుధవారం మధ్యాహ్నం కూడా రైల్వేస్టేషన్లలో రద్దీ కొనసాగుతుంది.
