×
Ad

Ballot Papers In Drain: డ్రైనేజీలో బ్యాలెట్ పేపర్లు.. బీఆర్ఎస్ సంచలన ఆరోపణలు.. ఎన్నికల సంఘం సీరియస్..

దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

  • Published On : December 14, 2025 / 06:30 AM IST

Ballot Papers In Drain: నల్గొండ జిల్లా చిన్నకాపర్తిలో బ్యాలెట్ పత్రాల ఘటనపై రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ను కోరింది. ఇప్పటికే స్టేజ్ 2 ఆర్వోను (రిటర్నింగ్ ఆఫీసర్) సస్పెండ్ చేశారు కలెక్టర్ త్రిపాఠి. మరోవైపు ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగానే జరిగిందన్న ఎస్ఈసీ కార్యదర్శి.. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపారు. విచారణ జరిపి సంబంధిత కౌంటింగ్ అధికారులపై చర్యలకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

చిన్నకాపర్తిలో పోలైన బ్యాలెట్ పత్రాలు డ్రైనేజీలో కనిపించడం కలకలం రేపింది. దీనిపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు.. రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలోని డ్రైనేజీలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి కత్తెర గుర్తుకు పోలైన బ్యాలెట్ పేపర్లు కనిపించాయి. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థి భిక్షం ఎన్నికల అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తొలి దశ ఎన్నికల్లో 455 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పేపర్లు కనిపించడంతో రిగ్గింగ్ జరిగిందంటూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఆరోపిస్తున్నారు. విషయం తెలియడంతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి చిన్నకాపర్తికి చేరుకుని ఆందోళనకు దిగారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని, ఈ ఎన్నిక చెల్లదని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు కలెక్టర్. ఈ ఘటనలో ఇప్పటికే స్టేజ్ 2 ఆర్వోను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్. ఈ ఘటనపై విచారణ అధికారిగా నల్లొండ ఆర్డీవోను నియమించారు.

Also Read: సర్పంచ్‌ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అసంతృప్తిగా ఉందా? రిజల్ట్స్‌ బీఆర్ఎస్‌ను ఆశ్చర్యపర్చాయా?