Bandi Sanjay
Bandi Sanjay: కర్రెగుట్టలపై ‘ఆపరేషన్ కగార్’ నిలిపివేసి మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ లోని కొత్తపల్లిలో హనుమాన్ విగ్రహాన్ని సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదని అన్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నోళ్లతో చర్చలు ఉండవ్ అంటూ సంజయ్ స్పష్టం చేశారు.
మావోయిస్టులను నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీసహా ఎంతో మంది నాయకులను మందుపాతరలు పెట్టి చంపినోళ్లు మావోయిస్టులు. అమాయక గిరిజనులను ఇన్ ఫార్మర్ల నెపంతో అన్యాయంగా కాల్చిచంపి ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభను మిగిల్చారు. తుపాకీ వీడనంత వరకూ మావోయిస్టులతో చర్చలు ఊసే ఉండదని బండి సంజయ్ అన్నారు.
కేంద్రం కులగణన పై సంజయ్ మాట్లాడుతూ.. కేంద్రం కులగణన నిర్ణయం చారిత్రాత్మకం అన్నారు. అయితే, అది కాంగ్రెస్ విజయమని చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ కులగణన సర్వేకు, మోదీ కులగణనకు పొంతనే ఉండదు. కాంగ్రెస్ కులగణనతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. బీసీల జనాభాను తగ్గించి చూపారు. కాంగ్రెస్ మాయమాటలను జనం నమ్మడం లేదు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాన్ని పక్కదోవ పట్టించేందుకే ఈ డ్రామాలాడుతోందని సంజయ్ అన్నారు.
పాస్ పోర్టు లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నాం. హింగ్యాలపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని సంజయ్ ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్యను రాజకీయం చేయడం సరికాదని సూచించారు. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చినా చర్యలెందుకు తీసుకోవడం లేదని రేవంత్ సర్కార్ ను సంజయ్ ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. ఆ రెండు పార్టీలు సిగ్గు లేకుండా మావోయిస్టులతో చర్చలు జరపాలని పోటీలు పడుతున్నారు. నక్సల్స్ తో మాటల్లేవు.. మాట్లాడుకోవడాల్లేవ్ అంటూ సంజయ్ మరోసారి పేర్కొన్నారు.