Prajahita Yatra: బండి సంజయ్ ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. మంత్రి పొన్నం ఏమన్నారంటే?
బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేైసుకుంది.
- Harishth Thanniru
- Published On : February 27, 2024 / 11:47 AM IST
MP Bandi Sanjay
MP Bandi Sanjay : కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజాహిత యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రజాహిత యాత్ర మంగళవారం రాములపల్లికి చేరుకోగానే పలువురు కాంగ్రెస్ నేతలు సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సంజయ్ పై దాడికి యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు అడ్డుకోవటంతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకు పరిస్థితి వెళ్లడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను అడ్డుకున్నారు. పలువురు నేతలను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం పటిష్టమైన భద్రత నడుమ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది.
Also Read : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ రెండు గ్యారెంటీ స్కీంల ప్రారంభంలో ట్విస్ట్
హుస్సాబాద్ లో సోమవారం నిర్వహించిన ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు పొన్నం ప్రభాకర్ ను కించపర్చేవిలా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ నియోజకవర్గం వ్యాప్తంగా బీజేపీ, బండి సంజయ్ దిష్టిబొమ్మలను కాంగ్రెస్ నేతలు దగ్దం చేశారు. పొన్నం ప్రభాకర్ అనుచరులతోపాటు కాంగ్రెస్ శ్రేణులు నియోజకవర్గ వ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. బీజేపీ ప్లెక్సీలను చించివేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్, సిద్ధిపేట కమీషనరేట్ పరిధిలోని పోలీస్ స్టేషన్ లకు తరలించారు. బండి సంజయ్ ఇవాళ పర్యటించే ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొడంతో పోలీసులు సంజయ్ యాత్రపై ఆంక్షలు విధించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఉండేందుకు సంజయ్ సభల్లో మాట్లాడొద్దని, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో పోలీసుల ఆంక్షల నడుమ బండి సంజయ్ యాత్ర కొనసాగుతుంది.
Also Read : కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్క మేడిగడ్డే కాదు.. కేటీఆర్ వివరణ
బండి సంజయ్ మాట్లాడుతూ.. నేను ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదనని అన్నారు. రాముడి జన్మస్థలం గురించి మాట్లాడితే ఉదాహరణగా మాట్లాడాను. ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని సంజయ్ మండిపడ్డారు. పొన్నం ప్రభాకర్ అంటే నాకు గౌరవం ఉంది. ప్రతీసారి నాపై కావాలనే ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నేను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నువ్వు నాపై పోటీగా నిలబడు, లేకుంటే నీవు బలపర్చిన అభ్యర్థి ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అంటూ పొన్నం ప్రభాకర్ కు సంజయ్ సవాల్ చేశారు. ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర కొనసాగుతుందని, యాత్రకు ప్రజల మద్దతు పెరుగుతుందని సంజయ్ అన్నారు. ప్రజా మద్దతు పెరుగుతుండటంతో కాంగ్రెస్ నేతలు నియోజకవర్గంలో ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే గత ప్రభుత్వానికి పట్టినగతే మీకు పడుతుందంటూ సంజయ్ కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు.
Also Read : Rajya Sabha polls : రాజ్యసభ ఎలక్షన్స్.. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లలో క్రాస్ ఓటింగ్ టెన్షన్..
బండి సంజయ్ రాజకీయ డ్రామాకు తెరలేపాడని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన నేపథ్యంలో.. ఐదేళ్ల కాలంలో మీరు ఎంపీగా ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించానని, శ్రీరాముడి పేరుతో ఓట్లు అడగడం కాదని సూచించానని పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ, నేను ఎన్నడూ అనని మాటలను రాముడు పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడినట్లు సంజయ్ అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని పొన్నం ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రజాహిత యాత్రకు ప్రచారం రావాలని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు అడ్డుకోకపోయినా మా కార్యకర్తలను రెచ్చగొట్టి బండి సంజయ్, బీజేపీ శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రయత్నిస్తున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు.
