Blast In Bhupalpally KTPP : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేల్లూరు కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (కేటీపీపీ)లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ప్లాంట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో విధుల్లో ఉన్న ఏడుగురు ఉద్యోగులు గాయపడ్డారు. వారిలో ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులు ఉన్నారు. మిగతా ఐదుగురు కూలీలు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన అధికారులు గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
భూపాలపల్లి కేటీపీపీ మొదటి దశ 500 మెగావాట్ల ప్లాంట్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ పంపించే మిల్లులో ఉన్నట్టుండి మిల్లర్ పేలింది. ఈ పేలుడు కారణంగా ప్లాంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓవైపు మంటలను అదుపు చేసే చర్యలు చేపట్టిన అధికారులు.. మరోపక్క గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గాయపడిన వారిలో ఒకరు ఆర్టిజన్ (బెల్ట్ మీద బొగ్గు సేకరించే పని), ఒకరు జేపీఏ ఉన్నారు. మరో ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఒకటో యూనిట్ లో ఈ ప్రమాదం జరిగింది. 6 మిల్లర్లు క్రషర్ అవుతాయని, అయితే, ఒక్కసారిగా ఎయిర్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అధికారులు వివరించారు.