Bridge Collapses In Peddapalli Maner River
Bridge Collapses In Peddapalli Maner River : పెద్దపల్లి జిల్లాలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముత్తారం మండలం ఓడేడు గ్రామం నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గర్మిళపల్లి మధ్య దూరం తగ్గించేందుకు వాగుపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్గంలో స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వంతెన కూలడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం స్థానికులు గమనించి అధికారులకు సమాచారం ఇచ్చారు. పగటివేళ రాకపోకల సమయంలో బ్రిడ్జి కూలిఉంటే పెనుప్రమాదం సంభవించేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Uttam Kumar Reddy : మరోసారి మోడీ వస్తే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది- ఉత్తమ్ కుమార్ రెడ్డి
మానేరు నదిపై 2016 సంవత్సరం ఆగస్టు నెలలో రూ.49కోట్లతో బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తొమ్మిదేళ్లు కావస్తున్నా నిర్మాణ పనులు ఇంకా పూర్తికాలేదు. కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలకు వంతెన ఫిల్లర్లు కుంగిపోయాయి. సోమవారం రాత్రి ఈదురు గాలుల బీభత్సంకు బ్రిడ్జిపై ఉన్న సిమెంట్ గైడర్లు కిందపడిపోయాయి.. దీంతో బ్రిడ్జి కుప్పకూలింది. నిర్మాణంలో నాణ్యతాలోపాలే బ్రిడ్జి కూలిపోవటానికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. బ్రిడ్జి వాడుకలోకి వచ్చిన తరువాత కూలిపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బ్రిడ్జి కూలిన ఘటనపై ఆర్ అండ్ బి అధికారులు స్పందిస్తూ.. గాలి దుమారం కారణంగానే సిమెంట్ గైడర్లు కుప్ప కూలిపోయి ఉంటాయని, పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. నాణ్యతాలోపాల కారణంగానే బ్రిడ్జి కూలిపోయింది.. ఈ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది.