రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ పై స్పందించిన కేసీఆర్.. అసెంబ్లీలో చీల్చిచెండాడుతామని వెల్లడి

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కేటాయించారు..

BRS Chief KCR

BRS Chief KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ. 2,91,159 కోట్లు కేటాయించారు.. బడ్జెట్ లో పలు రంగాలకు కేటాయింపులపై మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. అధికారం కోల్పోయిన తరువాత తొలిసారి అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లాడారు. ఈ బడ్జెట్ తెలంగాణ ఆశలపై నీళ్లు చల్లింది. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసింది. స్టోరీ టెల్లింగ్ బడ్జెట్ ప్రసంగం అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. బడ్జెట్ లో ఒక్క పాలసీ ప్రస్తావన లేదని విమర్శించారు.

Also Read : Telangana Budget 2024 : బడ్జెట్ లో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలకు భారీగా నిధులు.. మూసీ ప్రక్షాళనకు ఎన్నికోట్లంటే?

బడ్జెట్ లో కొత్తేమీ లేదు. ఏ సంక్షేమ పథకం ఇందులో లేదు. ఒత్తిఒత్తి పలకడం తప్ప భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో ఏమీ కనిపించలేదు. ఆరు మాసాలు సమయం ఇవ్వాలని నేను ఇన్నాళ్లు రాలేదని కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో రెండు పంటలకు రైతు బంధు ఇచ్చాము.. కాంగ్రెస్ హయాంలో రైతు బంధు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. రైతుకు ఈ బడ్జెట్ లో ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని అన్నారు. అంతా ప్రసంగమే తప్ప బడ్జెట్ లో సరైన శాఖలకు కేటాయింపులు ఏమీ లేదు. దళిత వర్గాల ప్రస్తావనే లేదు. దళిత బంధు ఊసే లేదు. మత్స్యకారులకు భరోసా లేదు.  గొర్రెల పథకాన్ని పూర్తిగా పక్కన పెట్టారని కేసీఆర్ అన్నారు. ఐటీ పాలసీ ఏమీ లేదు. పేద ప్రజల అభివృద్ధికి సంబంధించి ఎలాంటి పాలసీ లేదు. వ్యవసాయ స్థిరీకరణ లేదు. బడ్జెట్ ప్రసంగం మొత్తం ఓ స్టోరీ చెప్పినట్లుగానే ఉందని కేసీఆర్ విమర్శించారు. ఈ బడ్జెట్ పై అసెంబ్లీలో చీల్చి చెండాడుతామని కేసీఆర్ అన్నారు.

Also Read : అధికారంలోకి వచ్చిన నాటినుంచి సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా? అప్పులు ఎన్నంటే..

 

ట్రెండింగ్ వార్తలు