Kcr : నేను గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షలు వస్తాయన్నారు మోదీ.. మరి వచ్చాయా?- కేసీఆర్ ఫైర్

కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు.

Kcr : కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్. తెచ్చిన తెలంగాణను నాశనం చేస్తే తాను చూస్తూ ఊరుకోనని, యుద్ధం చేస్తానని కేసీఆర్ హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా క్లాక్ టవర్ సర్కిల్ లో కార్నర్ మీటింగ్ లో కేసీఆర్ మాట్లాడారు.

” బీజేపీ ఈ దేశాన్ని పదేళ్ల నుంచి పరిపాలిస్తోంది. ఈ దేశానికి బీజేపీ ఏం చేసిందో ఆలోచించాలి. కనీసం ఒక 100 నినాదాలు చెప్పారు. ఒక్కటన్నా నిజమైందా? మోదీ చెప్పిన కట్టుకథలు, పిట్టకథలు నిజమయ్యాయా? నేను గెలిస్తే ప్రతి కుటుంబానికి 15లక్షలు వస్తాయని మోదీ చెప్పారు. మరి వచ్చాయా? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కట్టి జాతీయ హోదా కోసం 100 ఉత్తరాలు రాశాం. ఇవాళ బీజేపీ అభ్యర్థి, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు? ఢిల్లీ సరిహద్దులో రైతు ఉద్యమంలో 750 మంది రైతులు మరణించారు. స్వయంగా నేనే వెళ్ళి రైతు కుటుంబాలకు పరిహారం అందించాను.

చట్టం ప్రకారం ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని నవోదయ పాఠశాలలు ఇవ్వాలి. ఒక్కటన్న నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా ఎందుకు వేయాలి? దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటి కూడా ఇవ్వలేదు. వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు పెట్టకపోతే రూ.5వేల కోట్ల గ్రాంట్ నిలిపివేస్తాం అన్నారు. నా ప్రాణం పోయినా, తలకాయ తెగినా మీటర్లు పెట్టను అని చెప్పాను.

ఇక్కడ చోటే భాయి, అక్కడ బడే భాయికి ఓటేసినా ఒక్కటే. మన నీళ్ళు తరలించుకుపోయిన రఘువీరా రెడ్డి పాదయాత్ర చేస్తే డీకే అరుణ మంగళ హారతులు పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 5 నెలలైంది. మాకు ఓటు వేస్తే నిమిషాల మీద చేసేస్తామని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం నడుస్తలేదు. చేనేత కార్మికుల స్కీమ్ లు రద్దు చేశారు. నా కళ్ళ ముందు తెలంగాణను నాశనం చేస్తే కేసీఆర్ యుద్ధం చేస్తాడు తప్ప నిద్రపోడు. తెచ్చిన తెలంగాణను నాశనం చేస్తే చూస్తూ ఊరుకోవాలా.. యుద్ధం చేద్దామా? ఎటువంటి పోరాటానికైనా యుద్ధం చేద్దాం. భువనగిరిలో బీజేపీ, కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ ను గద్దె దించి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నారు. ఈ రెండు పార్టీలు ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తున్నాయి.

ఒక పార్టీ వాళ్లు దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు. మరొక పార్టీ వాళ్లు దేవుళ్ల మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. చేసేది ఉంటే ముందే చేయాలి. ఒట్లు పెడితే ప్రజలు నమ్మరు. 5 ఎకరాలు దాటితే ఇవ్వం అంటున్నారు. నీ అయ్య జాగీరా? ఆ రైతులు తెలంగాణ బిడ్డలు కాదా.? రానున్న రోజుల్లో రైతుబంధు, భీమా ఉంటుందో ఉండదో? కులాలు, మతాలకు అతీతంగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలి” అని పిలుపునిచ్చారు కేసీఆర్.

Also Read : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ చెప్పాలి : కిషన్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు