KTR: మా ఆస్తులన్నీ ఇస్తాం వెయ్యికోట్లు ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి కేటీఆర్ సంచలన ఆఫర్
కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బందులకు గురిచేయడమే ధ్యేయంగా పనిచేస్తోందని కేటీఆర్ (KTR) ఘాటుగా విమర్శించారు.
- V Santhosh Kumar
- Published on- September 18, 2026 / 02:59 PM IST
BRS Leader Ktr challenges revanth reddy 1000 crore offer nampally court
- రేవంత్కి కేటీఆర్ సవాల్
- నాంపల్లి కోర్టుకు కేటీఆర్
- బీఆర్ఎస్పై కాంగ్రెస్ కక్ష
KTR: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురిచేయడమే ధ్యేయంగా పనిచేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఘాటుగా విమర్శించారు. ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలను నెరవేర్చడం పక్కనబెట్టి, ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణలో భాగంగా నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
రూ.1,000 కోట్లు ఇస్తే ఆస్తులన్నీ రాసిస్తా.. రేవంత్కు కేటీఆర్ ఓపెన్ ఆఫర్:
కేసీఆర్ కుటుంబం రూ.లక్ష కోట్లు కొల్లగొట్టిందని సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను కేటీఆర్ పూర్తిగా తోసిపుచ్చారు. ఈ సందర్భంగా ఆయన సీఎంకు ఒక సంచలన ఆఫర్ ఇచ్చారు. తమ కుటుంబ ఆస్తులన్నింటినీ తీసుకుని తమకు రూ.1,000 కోట్లు ఇస్తే ఎక్కడైనా సంతకం చేయడానికి సిద్ధమని, మిగిలిన రూ.99,000 కోట్లతో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చుకోవచ్చని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధికి, గ్లోబల్ పెట్టుబడులను ఆకర్షించేందుకు తాము రాత్రింబవళ్లు ప్రయత్నిస్తే, ప్రస్తుత ప్రభుత్వం తమపై కేసులు పెడుతోందని మండిపడ్డారు.
కేసీఆర్ ఆస్తులపై అసత్య ప్రచారాలు.. కేసులు పెట్టినా భయపడేది లేదు:
గతంలో కేసీఆర్కు వెయ్యి ఎకరాల భూమి ఉందంటూ తీవ్ర అసత్య ప్రచారాలు చేశారని, కానీ ఇటీవల అసెంబ్లీలో రేవంత్ రెడ్డే స్వయంగా కేసీఆర్కు కేవలం 67 ఎకరాల భూమి మాత్రమే ఉందని ఒప్పుకున్నారని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా తమను ఏమీ చేయలేరని, దేనికైనా సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ వేధింపులను ప్రజల ముందే ఎండగడతామని, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని ఆయన స్పష్టం చేశారు.
