KTR: రైతుబంధు కావాలా..? ఎక్స్లో ఆసక్తికర పోస్ట్ చేసిన కేటీఆర్
ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ
- Harishth Thanniru
- Published On : October 21, 2024 / 10:16 AM IST
KTR
KTR Comments on Congress Govt: ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం ఎకరానికి రూ.15వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ ఖాతాలో ఆసక్తికర పోస్ట్ చేశారు. రైతుబంధు కావాలా.. రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఒక్కటి కూడా అమలు చేయకపోగా.. ఉన్నవాటిని కూడా ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: జాగ్రత్తగా ఉండండి..! గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
కేటీఆర్ పోస్టు ప్రకారం..
రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..?
ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..?
రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!
నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!
ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!
పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే..అన్నదాత వెన్ను విరవడమే..!
రైతు ద్రోహి కాంగ్రెస్..చరిత్ర నిండా అనేక రుజువులు..ఇప్పుడు ఇంకొకటి !
