పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రతిపక్షానికి పరిమితం అయింది. లోక్సభ ఫలితాలు కూడా నిరాశపరచడంతో.. కేడర్ కాస్త నిరాశలోకి వెళ్లిపోయింది. తిరిగి పుంజుకొని జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్న బీఆర్ఎస్.. రేవంత్ సర్కార్పై యుద్ధం ప్రకటించింది. హామీల నుంచి ప్రభుత్వ విధానాల వరకు అన్నింటిని నిలదీస్తోంది.
ఈ ప్రాసెస్లో పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదవుతుండగా.. కారు పార్టీ ముందస్తు జాగ్రత్తలకు రెడీ అవుతోంది. పార్టీ బలోపేతం చేయడమే కాదు… పార్టీ నేతలపై ఈగవాలకుండా చూసుకునేందుకు లీగల్టీమ్ ఏర్పాటు చేస్తోంది. సర్కార్ పెట్టే పోలీసు కేసులకు న్యాయస్థానాలతో చెక్ పెట్టేందుకు గులాబీదళం చేస్తున్న వ్యూహం ఇప్పుడు ఆసక్తిరేపుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య వార్ పీక్స్ కు చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి
తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం.. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవకపోవడంతో.. పార్టీ శ్రేణలు నిరాశలో కూరుకుపోయాయ్. ముఖ్య నేతల నుంచి కార్యకర్తల వరకు ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్నారు. ఇప్పటి నుంచి వరుస కార్యక్రమాలతో ముందుకెళ్తేనే వచ్చే ఎన్నికల నాటికి పుంజుకుంటామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారట.
YSRCP: వైసీపీలో వరుస అరెస్ట్లు.. అసలు రీజన్ అదేనా? వైసీపీలో నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది?
దీంతో గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూనే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆందోళనలు, పోరాటాలు చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. రేవంత్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనికి అనుగుణంగానే పార్టీ కేడర్తో పాటు జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తోందని అధిష్టానం భావిస్తోంది. దీంతో కాంగ్రెస్ సర్కార్ మీద పోరాటంలో వెనక్కి తగ్గేదే లేదని పార్టీ పెద్దలు భావిస్తునట్లు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు
కాంగ్రెస్ హామీలపై నిలదీస్తూ.. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నప్పుడు.. బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయ్. ఆందోళనలు చేస్తున్న వారిపై చాలాసార్లు పోలీసు కేసులు నమోదు అవుతున్నాయ్. ముఖ్య నాయకుల నుంచి మొదలు.. కార్యకర్తల వరకు కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది. దీంతో కొంతమంది నేతలతో పాటు కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోందని తెలుస్తోంది. ఎడా పెడా కేసులు నమోదు చేస్తుంటే.. వెనక్కి తగ్గాల్సి వస్తోందనే చర్చ మొదలైందని టాక్.
దీంతో కాంగ్రెస్ సర్కార్పై వివిధ అంశాలపై పోరాటం చేసే నాయకుల నుంచి.. కేడర్ వరకు పార్టీ పరంగా భరోసా ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోందట. మరీ ముఖ్యంగా.. ద్వితీయ శ్రేణి నాయకులు, సామాన్య కార్యకర్తలపై ప్రభుత్వం కేసులు పెడితే ఎదుర్కొనేందుకు స్పెషల్ లీగల్ టీమ్ రెడీ అయింది. రేవంత్ సర్కార్పై పోరాటంలో ఏ ఛాన్స్ వచ్చినా వదలొద్దని.. న్యాయపరంగా అండగా ఉంటామంటూ కార్యకర్తలకు భరోసా ఇస్తోంది ఈ లీగల్ టీం.
తెలంగాణ భవన్ నుంచి కొత్త లీగల్ వింగ్ ఆపరేట్ అయ్యేలా.. పార్టీ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే తెలంగాణాభవన్ నుండే ప్రత్యేక లీగల్ టీం ప్రతిరోజు కేసులను మానిటర్ చేస్తూ సామాన్యులకు, కార్యకర్తలకు న్యాయ సాయం అందిస్తోంది. బీఆర్ఎస్ తరఫున మాట్లాడే వారు, సోషల్ మీడియాలో పోస్ట్లు చేసే వారిపై.. పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని… అలాంటి వాటిని ఎదుర్కోవడానికి లీగల్ టీమ్ ఉపయోగపడుతుందని చెప్తున్నారు.
కొత్త లీగల్ టీమ్దే కీలకపాత్ర
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎపిసోడ్లోనూ.. క్రిషాంక్ అరెస్టులోనూ… చివరకు కేటీఆర్ కేసులోనూ కొత్త లీగల్ టీమ్దే కీలకపాత్ర. వరుసగా తమ నేతలకు, కార్యకర్తలకు అండగా ఉంటున్న పార్టీ న్యాయ విభాగాన్ని… ఇంకా విస్తరించాలని బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తోంది.
ఆ మధ్య హైడ్రా బాధితులు.. కోర్టులో కేసులు వేయడానికి బీఆర్ఎస్ లీగల్ టీమ్ సహకరించింది. ఆ తర్వాత లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారి తరఫున కూడా.. కోర్టులో బీఆర్ఎస్ లీగల్ టీమ్ వాదించింది. ఇలా పార్టీ వాళ్లకు మాత్రమే కాకుండా.. బయట వాళ్లకు కూడా ఉచిత సర్వీస్ అందించడం ద్వారా.. ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం.
కేవలం పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రమే పరిమితం కాకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాడే సామాన్య జనాలకు కూడా లీగల్ సపోర్ట్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దీనికోసం తెలంగాణ భవన్లో ప్రత్యేక లీగల్ సెల్ విభాగం ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారట. ఇక అటు జిల్లాల్లోనూ ఇలాంటి లీగల్ సెల్స్ ఏర్పాటు చేసేలా కసరత్తు చేస్తున్నారట.