Jupally Ponguleti : వీడిన సస్పెన్స్.. కాంగ్రెస్ గూటికి పొంగులేటి, జూపల్లి
Jupally Ponguleti : మే 4 లేదా 5వ తేదీన సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతోంది. దీనికి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.
- Naveen
- Published On : April 20, 2023 / 08:00 PM IST
Jupally Ponguleti
Jupally Ponguleti : బీఆర్ఎస్ పై ఓ రేంజ్ లో విమర్శలు చేస్తూ ఆ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుల రాజకీయ భవిష్యత్ పై సస్పెన్స్ వీడింది. వారిద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మే మొదటి వారంలో ప్రియాంక గాంధీ సమక్షంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
Also Read..Telangana Politics: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి
ఇప్పటికే మే మొదటి వారంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పొంగులేటి చెప్పారు. మే 4 లేదా 5వ తేదీన సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ నిరసన దీక్ష చేపడుతోంది. దీనికి ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. నిరుద్యోగ నిరసన దీక్షలోనే పొంగులేటి, జూపల్లికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించనున్నారు.
ఖమ్మంలో ఈ నెల 24న కాంగ్రెస్ నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టనుంది. ఖమ్మంలో నిరుద్యోగ బహిరంగ సభపై చర్చించేందుకు రేణుకా చౌదరి నివాసంలో సమావేశమైన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరిక అంశంపై చర్చించారు. పొంగులేటి కాంగ్రెస్ లోకి వచ్చేలా చొరవ చూపాలని పార్టీ నేతలు రేణుకా చౌదరిని కోరినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పొంగులేటి చేరికపై రేణుకతో చర్చించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి కృష్ణారావులకు పట్టు ఉంది. పొంగులేటి వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. కొత్తగూడెంలో పొంగులేటి ఆత్మీయ సమ్మేళనానికి నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి వంద కార్లతో ర్యాలీగా జూపల్లి కృష్ణారావు వెళ్లటం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. పొంగులేటి, జూపల్లిని బీఆర్ఎస్ సస్పెండ్ చేశాక ఇద్దరు నేతలకు అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఆఫర్లు ఇస్తూ వచ్చాయి.
Also Read..Achchennaidu : వైసీపీ-బీజేపీ మధ్య సంబంధం ఉందో లేదో ప్రజలకు తెలుసు : అచ్చెన్నాయుడు
అయితే, తమతో పాటు తమ అనుచరులకూ టికెట్లు ఇస్తేనే పార్టీలో చేరే అంశాన్ని పరిశీలిస్తామని ఆయా పార్టీల అగ్రనేతలతో చర్చించారు పొంగులేటి, జూపల్లి. ఓ దశలో ఇద్దరూ బీజేపీలో చేరతారనే ప్రచారం జోరుగా జరిగింది. అయితే, తమ తమ జిల్లాలలోని రాజకీయ సమీకరణాలను, కాంగ్రెస్ కున్న ఆదరణను బేరీజు వేసుకుని కాంగ్రెస్ నేతలతో టచ్ లోకి పొంగులేటి వెళ్లినట్లు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
