Bandi Sanjay01
BANDI SANJAY ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్యకు బాధ్యులైన మంత్రి పువ్వాడ అజయ్తోపాటు, పోలీసులపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
విమర్శించారు. సీఎంఓ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే కేసు నమోదు చేయడం లేదని బండి సంజయ్ అన్నారు. సాయి గణేష్ ఇచ్చిన మరణ వాంగ్మూలం ఆధారంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సాయి గణేష్ మృతికి బాధ్యులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని హెచ్చరించారు. ‘‘టీఆర్ఎస్ నేతలు, జిల్లా మంత్రి బీజేపీని చూసి భయపడుతున్నారు. అందుకే బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను ఇబ్బందిపెట్టిన వారిని వదిలిపెట్టబోం. కచ్చితంగా శిక్షించి తీరుతాం’’ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నమ్మిన సిద్ధాంతం కోసం సాయి గణేష్ కట్టుబడి ఉన్నాడని, చట్టానికి అనుగుణంగా పాలకుల అక్రమాలు, అన్యాయాలపై పోరాడాడని కొనియాడారు. నిరుపేద కుటుంబానికి చెందిన సాయి గణేష్కు పేదింటి అమ్మాయితో వివాహం కుదిరిందని, త్వరలో జరగబోయే పెళ్లికి రావాలని తనను కోరినట్లు బండి చెప్పారు. అయితే, అంతలోనే సాయి గణేష్ ఆత్మహత్యకు పాల్పడటం బాధ కలిగించిందన్నారు. పోలీసుల వేధింపులతో బీజేపీ మజ్దూర్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు సాయి గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే.