Stray Dog Bites 40 People In 2 Hours
Cases of dog bites: మొన్న హైదరాబాద్ అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ మృతి.. నిన్న రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడలో వీధి కుక్కల స్వైర విహారం.. బాలుడికి తీవ్రగాయాలు.. మరో ఐదుగురికి స్వల్ప గాయాలు. ఈ రెండు ఘటనలను మరవకముందే ఇవాళ మరో ప్రాంతంలో ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టించింది. 10 మందిని కరిచింది.
వారిలో ఏడుగురికి స్వల్పగాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పిచ్చి కుక్కను స్థానికులు కొట్టి చంపారు. పిచ్చి కుక్క స్వైర విహారం చేయడంతో స్థానికులు హడలిపోయారు. వరుసగా వీధి కుక్కల దాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో ఈ ఘటన స్థానికులను మరింత భయాందోళనలకు గురిచేసింది. కుక్కల దాడుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైంది.
కుక్కల దాడుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. రెండు రోజుల క్రితం బాలుడు ప్రదీప్ ని కుక్కలు పీక్కుతిన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. కుక్క దాడి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రులు చెప్పారు, వీధి కుక్కల నియంత్రణ చేపడతామని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా అన్నారు. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.