Caste Census Survey: కులగణనలో మీ పేరు లేదా..? డోంట్వర్రీ.. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే వాళ్లే వచ్చి రాసుకుంటారు..
రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి 28వ తేదీ వరకు మరోమారు ప్రభుత్వం కులగణన సర్వేను నిర్వహించనుంది.
- Harishth Thanniru
- Published On : February 16, 2025 / 10:11 AM IST
Caste Survey
Caste Census Survey: రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మరోమారు సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణన సర్వే జరగనుంది. ఈనెల 28వ తేదీ వరకు సర్వే నిర్వహిస్తారు. గతేడాది నవంబర్ 6వ తేదీన కుల గణన సర్వేను ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 25వ తేదీ వరకు 50రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుల గణన సర్వే వివరాలపై ప్రకటన చేశారు.
Also Read: Indiramma Indlu: ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు గుడ్న్యూస్.. ముందు కట్టేది అక్కడే..
రాష్ట్రంలో నిర్వహించిన కుల గణన సర్వే ద్వారా 1,15,71,457 కుటుంబాలకుగాను 1,12,15,134 కుటుంబాలను (96.9శాతం) సర్వే చేయడం జరిగిందని, ఇంకా 3,56,323 (3.1శాతం) కుటుంబాలను సర్వే చేయలేదని ప్రభుత్వం చెప్పింది. అయితే, గతంలో నిర్వహించిన సర్వే సందర్భంగా వివరాలు ఇవ్వనివారు, ఇళ్లకు తాళాలు వేసి వెళ్లినవారికోసం ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఈనెల 28వ తేదీ వరకు సర్వే నిర్వహించనుంది. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలో 100శాతం జనాభాను కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Also Read: Ration Card: రేషన్ కార్డుదారులకు గుడ్న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. ఉగాది నుంచి..
ఫోన్ చేస్తే మీ ఇంటికొస్తారు..
గతంలో నిర్వహించిన కులగణన సర్వేలో వివరాలు ఇవ్వని వారి వివరాలను ఈ సర్వేలో అధికారులు సేకరించనున్నారు. ఇందుకోసం టోల్ ఫ్రీ నంబర్ 040-21111111ను ఏర్పాటు చేశారు. ఈ నంబర్ కు ఫోన్ చేసిన వారి ఇళ్లకు ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటారని అధికారులు తెలిపారు. ఇవాళ్టి నుంచి ఈనెల 28వ తేదీ వరకు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఫోన్ కాల్స్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎంపీడీవో, వార్డు కార్యాలయాలకు వెళ్లి కూడా ప్రజలు స్వచ్ఛందంగా తమ వివరాలు నమోదు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.
ప్రజా పాలనా సేవా కేంద్రాల ద్వారా కూడా మీ వివరాలను వెల్లడించొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో, పట్టణ ప్రాంతాల్లోని వార్డు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా సేవా కేంద్రాలకు ప్రజలు వెళ్లి తమ వివరాలను అందించాలి. అలాకాకుంటే.. ఆన్ లైన్ లో http//seeepcsurvey.cgg.gov.in అనే వెబ్ సైట్ నుంచి సర్వే ఫారాన్ని డౌన్ లోడ్ చేసుకోవాలి. అందులో తమ కుటుంబ వివరాలను నమోదు చేసిన తరువాత ఆ ఫారాన్ని దగ్గరలోని ప్రజా పాలనా కేంద్రంలో సమర్పించాల్సి ఉంటుంది.
