చెస్ట్ ఆసుపత్రి నిర్వాకం : ఒకరిని డిశ్చార్జ్ చేయాల్సింది..కొత్తగూడెం DSPని డిశ్చార్జ్ చేశారు

  • Publish Date - April 10, 2020 / 08:56 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందిపై ప్రశంసలు కురుస్తుంటే..చెస్ట్ ఆసుపత్రి చేసిన నిర్వాకం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకరికి బదులు మరొకరిని డిశ్చార్జ్ చేసి నాలుక కరచుకున్నారు. డిశ్చార్జ్ చేసిన వ్యక్తికి కరోనా ఇంకా తగ్గనే లేదు. ఆయన ఎవరో కాదు..ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన డీఎస్పీ షేక్ ఆలీ. తనకు తగ్గిందని ఆనందంలో ఉన్న షేక్ ఆలీని మరలా ఆసుపత్రికి రప్పించారు. దీంతో మరలా కొత్తగూడెం జిల్లాలో భయాందోళన పరిస్థితి నెలకొంది. ఇద్దరి పేర్లు ఒకేలా ఉండడంతో చెస్ట్ ఆసుపత్రి కన్ ఫ్యూజ్ అయ్యారు. 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుండడంతో ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. చెస్ట్ ఆసుపత్రిలో కూడా ఇదే విధంగా ఏర్పాటు చేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. 2020, ఏప్రిల్ 09వ తేదీ గురువారం కొత్తగూడెం డీఎస్పీగా ఉన్న ఎస్ఎం షేక్ ఆలీని డిశ్చార్జ్ చేశారు ఆసుపత్రి వైద్యులు. దీంతో ఆయన సొంతూరు కొత్తగూడెంకు వెళ్లిపోయారు.(కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు..కేబినెట్ భేటీపై ఉత్కంఠ)

మరోసారి కేస్ షీట్లను సిబ్బంది పరిశీలిస్తున్నారు. అందులో షాకింగ్ న్యూస్ బయటపడింది. తాము డిశ్చార్జ్ చేయాల్సింది డీఎస్పీని కాదని..వేరే వ్యక్తిని అని తేల్చారు. వెంటనే ఈ విషయాన్ని డీఎస్పీ ఆలీకి తెలియచేశారు. వ్యాధి నయం అయ్యిందని సంతోషపడిన ఆలీ..గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లైంది. వెంటనే హైదరాబాద్ చెస్ట్ ఆసుపత్రికి వచ్చారు. పరీక్షల్లో నెగటివ్ అని తేలింది. ఇతడిని గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. 

దీంతో తాము చేసిన తప్పు తెలుసుకున్నారు. అసలు ఆలీని డిశ్చార్జ్ చేయాల్సి ఉంది. మరోసారి పోలీసులు, వైద్యులు రంగంలోకి దిగారు. డీఎస్పీ ఎక్కడెక్కడ తిరిగారు ? ఎవరితో మాట్లాడారు అనే దానిపై ఆరా తీస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి. 

లండన్ నుంచి వచ్చిన తన కొడుకుని క్వారంటైన్ చేయకుండా బయటకు పంపినందుకు కొత్తగూడెం డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. లండన్ నుంచి వచ్చిన డీఎస్పీ కుమారుడికి కరోనా పాజిటివ్ అని రిపోర్టు వచ్చింది. డీఎస్పీ కుటుంబసభ్యులందరినీ క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో డీఎస్పీతో పాటు..ఇంటిలో పనిచేసే వంట పనిమనిషికి కూడా కరోనా లక్షణాలు కనిపించాయి.

డీఎస్పీ కొడుకు లండన్‌లో విద్యాభ్యాసం చేస్తున్నాడు. మార్చి 18న లండన్ నుంచి హైదరాబాద్ తిరిగొచ్చాడు. అక్కడి నుంచి కారులో కొత్తగూడెం వెళ్లినట్లు తెలుస్తోంది. మార్చి 20న దగ్గు, జ్వరం లక్షణాలు కనిపించడంతో కరోనాగా అనుమానించి ప్రత్యేక అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. అతడి నమూనాలను పరీక్షలకు పంపించారు. ఆదివారం (మార్చి 22) అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.