Bachupally Child Died : హైదరాబాద్ బాచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయివేట్ స్కూల్ బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందారు. స్కూల్ బస్సు చిన్నారిని ఢీకొట్టి, ఆమెపై నుంచి వెళ్లడంతో మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం గ్రామానికి చెందిన కిషోర్, పద్మ దంపతుల మొదటి కుమార్తె దీక్షిత. వీరు హైదరాబాద్ లో నివసిస్తున్నారు.
హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని బౌరంపేట్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో 8 ఏళ్ల చిన్నారి దీక్షిత రెండో తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం చిన్నారిని తండ్రి కిషోర్ స్కూటీపై స్కూల్ కు తీసుకెళ్లున్నాడు. ఈ క్రమంలో బాచుపల్లి పరిధిలో రెడ్డీస్ ల్యాబ్ వద్ద స్కూటీని ఓ ప్రయివేట్ స్కూల్ బస్సు ఢీకొట్టింది. దీంతో చిన్నారి ఎగిరి రోడ్డుపై పడ్డారు.
అనంతరం చిన్నారి పైనుంచి స్కూల్ బస్సు వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. తండ్రికి గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చికిత్స కోసం చిన్నారి తండ్రి కిషోర్ ను ఆస్పత్రికి తరలించారు.
చిన్నారి దీక్షిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విచారిస్తున్నారు.
బోయిన్ పల్లిలో రోడ్డు ప్రమాదం.. తండ్రీకూతురుకు తీవ్ర గాయలు
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం అదుపుతప్పి తండ్రీకూతురు కింద పడ్డారు. ఈ క్రమంలో వెనుక నుండి వచ్చిన డీసీఎం వారిపై నుండి దూసుకెళ్లడంతో తండ్రీకూతురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే క్షతగాత్రులను స్థానికంగా ఉన్న రష్ ఆస్పత్రికి తరలించారు.
బోయిన్ పల్లిలో వంపుగా ఉన్న రోడ్ ఎక్కించబోతూ తండ్రీకూతురు బైక్ పై నుంచి జారీ కింద పడ్డారు. బైక్ పై నుంచి పడిపోయిన వెంటనే వారిని డీసీఎం ఢీకొట్టింది. ప్రాణపాయ స్థితిలో ఉన్న వైష్ణవిని స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎమ్ఎన్ఆర్ కాలేజ్ లో వైష్ణవి డిగ్రీ చదువుతోంది. వైష్ణవిని కాలేజీ బస్సు ఎక్కించేందుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.