కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి..ఆర్డీవో సమక్షంలో కొట్టుకున్న ఇరువర్గాలు
- bheemraj
- Published On : November 12, 2020 / 06:40 PM IST
Congress and TRS Clashes : నల్గొండ జిల్లా నిడమనూరు తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం రాళ్ల దాడి చేసుకున్నారు. ఇరువురు కొట్టుకున్నారు. ఆర్డీవో రోహిత్ సింగ్ సమక్షంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారు.
వరద బాధితుల ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ గురువారం (నవంబర్ 12,2020) టీపీసీపీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తహసీల్దార్ ను కలిశారు. అర్హులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడి చేరుకుని కాంగ్రెస్ నేతలతో గొడవకు దిగారు.
దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తొపులాట జరిగింది. ఆ తర్వాత రెండు పార్టీల నేతలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కాంగ్రెస్ నేతల ఆరోపణలను టీఆర్ఎస్ నాయకులు ఖండించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిడమనూరు మండల కేంద్రంలో జడ్చర్ల-కోదాడ హైవేపై ఉన్న బ్రిడ్జీ పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో బ్రిడ్జీ పక్కనే ఉన్న పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి.
అయితే బాధితులకు నష్టం పరిహారం చెల్లించే విషయంలో అధికారులు, స్థానిక టీఆర్ఎస్ నేతలు ఏకపక్షంగా బాధితులు, లబ్ధిదారులను గుర్తించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
