CM KCR Yadadri : సీఎం కేసీఆర్ సతీసమేతంగా నేడు యాదాద్రికి వెళ్లనున్నారు. తెలంగాణలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో.. అనుబంధ ఆలయంగా ఉన్న పర్వతవర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో పంచకుండాత్మక మహా కుంభాభిషేకంలో కేసీఆర్ దంపతులు పాల్గొంటారు. అనంతరం మహాకుంభ సంప్రోక్షణతోపాటు, ఉద్ఘాటన మహోత్సవంలో కూడా పాల్గొంటారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ దంపతులతోపాటు, తొగుట పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి కూడా హాజరవుతారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి అనుబంధ ఆలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ప్రారంభం కోసం.. ఈ నెల 20 నుంచి మహాకుంభాభిషేక మహోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. నాలుగు రోజులుగా.. పాంచాహ్నిక దీక్షతో పంచకుండాత్మక రుద్ర యాగం నిర్వహిస్తున్నారు అర్చకులు.
Yadagirigutta Temple: యాదాద్రి ప్రధాన ఆలయంలో ఆర్జిత సేవలు పునఃప్రారంభం
అందులో భాగంగానే.. ఇవాళ శివాలయం ఉద్ఘాటన, రామలింగేశ్వరస్వామి స్పటికలింగ ప్రతిష్ఠాపనలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొననున్నారు. ఉదయం 10 గంటల 25 నిమిషాలకు మాధవానంద సరస్వతి స్పటిక లింగ ప్రతిష్ఠ, ప్రాణప్రతిష్ఠ చేసి శివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఆ తర్వాత రామలింగేశ్వరస్వామికి సీఎం కేసీఆర్ దంపతులు తొలిపూజ చేయనున్నారు.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత.. తొలిసారి సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటనకు వెళ్తున్నారు. సీఎం పర్యటనతో.. దేవాలయ అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.