government schools English medium : వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. వనపర్తిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి.. మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టం చేయనుందని సీఎం కేసీఆర్ తెలిపారు. దీనికి వనపర్తి జిల్లా వేదికగా శ్రీకారం చుట్టామని తెలిపారు.
తామంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని పైకి వచ్చిన వాళ్లమేనన్నారు. భవిష్యత్లో చాలా చక్కటి వసతులు పాఠశాలల్లో నిర్మాణం కాబోతున్నాయన్నారు సీఎం కేసీఆర్. పాఠశాలల్లో 12 రకాల మౌలిక సదుపాయాల కోసం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రారంభిస్తున్నారు. మొత్తం 26 వేలకు పైగా పాఠశాలలను ఈ పథకం క్రింద అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 9 వేల 123 పాఠశాలల్లో పనులు ప్రారంభిస్తారు.
CM KCR : కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ
రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. మహబూబ్నగర్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటయ్యాయని కేసీఆర్ అన్నారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే మహబూబ్నగర్ జిల్లా వజ్రపు తునకగా మారుతుందన్నారు.
గిరిజనుల రిజర్వేషన్ పెంపు ప్రతిపాదనను కేంద్రానికి పంపితే ప్రధాని మోదీ ఆమోదించలేదని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కాషాయ జెండాను.. బీజేపీని బంగాళాఖాతంలో కలపాలన్నారు. ప్రజలకు మతపిచ్చి లేపి దేశాన్ని సర్వనాశనం చేసే వారికి బుద్ధి చెప్పాలన్నారు.