CM KCR Visit Narayankhed : సంగమేశ్వర-బసవేశ్వర సాక్షిగా చక్కని సాగు దృశ్యాన్ని ఆవిష్కరించనుంది తెలంగాణ ప్రభుత్వం. 2022, ఫిబ్రవరి 21వ తేదీ సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు ప్రాజెక్టులకు నారాయణఖేడ్లో శంకుస్థాపన చేయనున్నారు. 4 వేల 427 కోట్ల అంచనా వ్యయంతో ఈ రెండు ఎత్తిపోతల పథకాలను ప్రభుత్వం నిర్మించనున్నది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షలకు, ఆంథోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగు నీరు అందనుంది.
Read More : Visakha : విశాఖ సాగర తీరంలో యుద్ధనౌకల సమీక్ష..
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు సింగూర్ ప్రాజెక్టుకు చేరుకుని అక్కడి నుంచి లిఫ్టుల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని బీడు భూములు సస్యశ్యామలం చేయనున్నాయి. సింగూరు ప్రాజెక్టు నుంచి 3.4 కిలోమీటర్ల అప్రోచ్ కాలువతో ఈ ఎత్తిపోతల పథకం ప్రారంభం అవుతుంది. ముఖ్యమంత్రి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన తర్వాత నారాయణఖేడ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే సంగారెడ్డి జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ముఖ్య కార్యకర్తలు, నాయకులతో సమావేశాలు నిర్వహించారు. బహిరంగ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు టీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.