Revanth Reddy : ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. సడెన్ టూర్కు అసలు కారణాలు ఇవే..!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పార్టీ పనులకోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగనుంది.
- Harishth Thanniru
- Published On : August 16, 2024 / 08:28 AM IST
CM Revanth Reddy
CM Revanth Reddy Delhi Tour : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పార్టీ పనులకోసం ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఆపిల్, ఫ్యాక్స్ కాన్ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి భేటీకానున్నారు. తెలంగాణలో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై వివిధ కంపెనీల ప్రతినిధులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి హైదరాబాద్ లో 400 మిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులకోసం ఎలక్ట్రానిక్స్ మేజర్ తో సీఎం రేవంత్ ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది. మంగళవారం ఢిల్లీలో జరిగిన ఏఐసీసీ విస్తృత స్థాయి సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరుకాలేదు. ఆ సమయంలో రేవంత్ విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ పెద్దలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, సోనియాగా గాంధీతో సమావేశం కానున్నారు.
Also Read : KTR Comments : మహిళలపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. కాంగ్రెస్ సీరియస్.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపు!
పెండింగ్ లో ఉన్న నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై పార్టీ కేంద్ర అధిష్ఠానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపే అవకాశం ఉంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సోనియాగాంధీని, రుణమాఫీ హామీ పూర్తయిన నేపథ్యంలో వరంగల్ లో నిర్వహించనున్న రైతు కృతజ్ఞత బహిరంగ సభకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించనున్నారు. సచివాలయం వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తున్న విషయం తెలిసిందే. అదేవిధంగా, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల పంట రుణాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి మాఫీ చేసిన విషయం తెలిసిందే.
Also Read : కేసీఆర్ను అవమానించాలనే అలా చేశారా? కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రొటోకాల్ గొడవ.. అసలేం జరిగిందంటే..
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై మరో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి చేరికలకు సంబంధించి అధిష్టానం అనుమతి కోరేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, అర్ధాంతరంగా పార్టీలో చేరికలు నిలిచిపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలతోపాటు.. రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారని, వారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు అధిష్టానం అనుమతిని తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పెద్దలతో భేటీలో నూతన పీసీసీ చీఫ్ ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల విషయంపై క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
