CM Revanth Reddy : బిడ్డ బెయిల్ కోసం బీజేపీతో చీకటి ఒప్పందం..!- కేసీఆర్పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతాం.
- Naveen
- Published On : April 16, 2024 / 12:52 AM IST
Cm Revanth Reddy Slams Kcr
CM Revanth Reddy : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ తన కూతురు కవిత బెయిల్ కోసం బీజేపీతో కుమ్మక్కు అయ్యారని ఆయన ఆరోపించారు. బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. జైల్లో ఉన్న బిడ్డను కాపాడుకునేందుకు కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవాన్ని, బీఆర్ఎస్ ను మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఓట్లన్నీ బీజేపీకి మళ్లించాలని కేసీఆర్ చెబుతున్నారని సీఎం రేవంత్ అన్నారు.
కొన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నేతలు ప్రచారమే చేయడం లేదన్నారు రేవంత్ రెడ్డి. మహబూబ్ నగర్, మల్కాజ్ గిరి, భువనగిరి, చేవెళ్ల, జహీరాబాద్ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ లోపాయికారిగా చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్ ఆరోపణలు చేశారు. ఇక, తెలంగాణలో కాంగ్రెస్ ను 14 ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే ఆగస్టు 15లోపు ముదిరాజ్ సామాజికవర్గానికి మంత్రి పదవి ఇస్తానని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ”దొరలకు, పెత్తందారులకు కాకుండా బీసీలు, సామాన్యులను కాంగ్రెస్ ఎంపీ టికెట్లు ఇచ్చింది. రాష్ట్రంలో 10శాతం జనాభా ఉన్న ముదిరాజ్ లకు కేసీఆర్ ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు. వారిని బీసీ-డీ నుంచి బీసీ-ఏ గ్రూప్ లోకి మార్చేందుకు ప్రయత్నిస్తాం. మంచి లాయర్లను పెట్టి సుప్రీంకోర్టులో కేసు గెలిచేలా పోరాడతాం. 15 ఎంపీ సీట్లను గెలిపిస్తే ముదిరాజ్ బిడ్డను మంత్రి చేస్తా” అని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read : వారికి లైన్ క్లియర్..! పార్లమెంట్ ఎన్నికల వేళ చేరికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక ఫోకస్
