Cm Revanth Reddy : నిజాంలకు, రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది- సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు.

Cm Revanth Reddy : ప్రధాని మోదీ, బీజేపీపై నిప్పులు చెరిగారు సీఎం రేవంత్ రెడ్డి. ఆధిపత్యం చలాయించి భయపెడతామంటే నిజాంలకు, రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుందని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి కేసులకు భయపడేటోడు కాదని తేల్చి చెప్పారు. నాకు మద్దతుగా తెలంగాణ ప్రజలు, 50లక్షల మంది యువత ఉన్నారని చెప్పారు. ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు.

”ఈ ఎన్నికలు ఆషామాషీ ఎన్నికలు కాదు. రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే 400 సీట్లు గెలవాలని కోరుకుంటోంది. రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలని భావిస్తోంది. బీజేపీ కుట్రలను తిప్పికొట్టేందుకు నేను బహిరంగంగా ప్రశ్నించా. అందుకే నాపై పగపట్టి ఢిల్లీలో కేసు పెట్టారు. స్వయంగా హోంశాఖనే నాపై కేసు పెట్టింది. ఈడీ, సీబీఐ, ఐటీనే కాదు.. ఇప్పుడు ఢిల్లీ పోలీసులను పంపి భయపెట్టాలని చూస్తున్నారు.

రేవంత్ రెడ్డి కేసులకు భయపడేటోడు కాదు. నాకు మద్దతుగా తెలంగాణ ప్రజలు ఉన్నారు. 50లక్షల మంది యువత ఉన్నారు. ఇలాగే వ్యవహరించిన కేసీఆర్ ను అసెంబ్లీలో ఎన్నికల్లో ప్రజలు 100 మీటర్ల గోతి తీసి బొంద పెట్టారు. ప్రధానిగా వ్యవహరిస్తే మోదీని గౌరవిస్తా. కానీ, గుజరాత్ ఆధిపత్యం ప్రదర్శించి తెలంగాణను అవమానిస్తే ఎదిరించి నిలబడతా.

ఈ ప్రాంతానికి ఏం ఇస్తారో చెప్పకుండానే ప్రధాని ఇక్కడికి వచ్చి వెళ్లిపోయారు. విభజన హామీలు, పసుపు బోర్డు అంశాలపై మోదీ ఏదైనా చెబుతారేమో అనుకున్నాం. కానీ, ఇవేవీ చెప్పకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్నారు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటే రిజర్వేషన్లు రద్దు చేయడమేనా..? మోదీని మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధికి నిధులు అడిగా.. ఆ విషయం మాట్లాడలేదు. హైదరాబాద్ దాహార్తి కోసం నీటిని కేటాయించాలని కోరితే ఇవ్వలేదు.

మోదీ స్థాయికి అబద్దాలు మాట్లాడటం తగదు. రిజర్వేషన్లు ఉండాలని చెబితే నాపై కేసులు పెడతారా? గుజరాత్ నుంచి వచ్చి తెలంగాణపై పెత్తనం చేస్తామంటే కుదరదు. నా రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రినే బెదిరిస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ ప్రధాని గారు. ఇయ్యాల నన్ను ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలని హుకుం జారీ చేశారు. మోదీగారు ఇదేనా మీ విధానం. ఆధిపత్యం చలాయించి భయపెడతామంటే నిజాంలకు, రజాకార్లకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.

పదేళ్లలో మోదీ తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు మాత్రమే. గాడిద గుడ్డు తెచ్చిన వాళ్లకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలా? 43ఏళ్లుగా జీవన్ రెడ్డి పదవులకు వన్నె తెచ్చారు. కానీ ఏనాడు పదవిని అడ్డు పెట్టుకుని అవినీతికి పాల్పడలేదు. నిజామాబాద్ ఎంపీగా జీవన్ రెడ్డిని గెలిపించి.. కేంద్రంలో ఇండియా కూటమి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా చేసుకుందాం. జీవన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించండి” అని పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

Also Read : అమిత్ షా ఫేక్ వీడియో కేసు.. ఢిల్లీ పోలీసులకు సమాధానం ఇచ్చిన సీఎం రేవంత్

 

ట్రెండింగ్ వార్తలు