CM Revanth Reddy travels in RTC Bus
Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ)ని బలోపేతం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఉద్యమాన్ని ఆర్టీసీ కార్మికులు ముందుండి నడిపించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ఆర్టీసీకి రూ.500 కోట్లు ఇచ్చామన్నారు. శనివారం ఎన్టీఆర్ మార్గ్లో 100 కొత్త బస్సులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్కలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడితే ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారని, అయితే కాలేదన్నారు. గత ప్రభుత్వం వీరిని విస్మరించిందన్నారు. గతంలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే పట్టించుకోలేదని, తమ ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత మహాలక్ష్మీ పథకాన్ని ప్రారంభించామని చెప్పారు.
KTR: 13న మేడిగడ్డ ప్రాజెక్ట్ సందర్శనకు రేవంత్ ప్రభుత్వ ఆహ్వానంపై కేటీఆర్ స్పందన
రెండు నెలల్లో 15 కోట్ల 21 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రోజుకు ప్రభుత్వం పై రూ.13కోట్లు, ప్రతి నెల రూ.300 కోట్ల భారం పడినా వెనకడుగు వేయడం లేదన్నారు. మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన రూ.535 కోట్ల చెక్కును ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు అందజేశారు. అలాగే సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. అనంతరం కొత్తగా ప్రారంభించిన బస్సుల్లో కాసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం చేశారు.