CM Revanth Reddy : లోక్సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచిన సీఎం రేవంత్ రెడ్డి.. భువనగిరిలో రోడ్షో
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు.. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు.
- Harishth Thanniru
- Published On : April 21, 2024 / 08:49 AM IST
CM Revanth Reddy
Lok Sabha Election 2024 : లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. మే 13న రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అభ్యర్థుల నామినేషన్ల కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొంటూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. రాష్ట్రంలో పదిహేడు నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో విజయం సాధించేందుకు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. ఆమేరకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా పదిహేను నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం మరో మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. నేడు, రేపు ఆయా నియోజకవర్గాలో అభ్యర్థులను కేంద్ర పార్టీ అధిష్టానం ప్రకటిస్తుందని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు.
Also Read : Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే
సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనడంతోపాటు.. ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ నామినేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గోనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు జరిగే రోడ్ షో, సభలో రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు. భువనగిరి సభకు సీఎంతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికూడా హాజరుకానున్నారు. ప్రచార సభల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోదీలపై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. హామీల అమలుపై కూడా స్పష్టమైన ప్రకటనలు చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామంటూ రేవంత్ స్పష్టం చేశారు. తమ వంద రోజుల పరిపాలనతో పాటు కేంద్రంలో కాంగ్రెస్ వస్తే ఏం చేస్తుందనే విషయాన్ని జనంలోకి రేవంత్ రెడ్డి తీసుకెళ్తున్నారు.
Also Read : కేసీఆర్ జైలుకే అన్నారు.. మరి ఎందుకు అరెస్ట్ చేయడం లేదు?: సీఎం రేవంత్పై రఘునందన్ ఫైర్
సాయంత్రం 4గంటలకు భువనగిరికి చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి.. హైదరాబాద్ చౌరస్తా, జగదేవ్ పూర్ రోడ్, పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించి, అక్కడ ఏర్పాటు చేసిన కార్నర్ సమావేశంలో రేవంత్ ప్రజలనుద్దేశించి మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపారు. మరోవైపు రేవంత్ పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సీపీ పరిశీలించారు. పట్టణంలో ప్రధాన రహదారి వెంబడి సీఎం రేవంత్ రోడ్ షో కార్యక్రమం ఉన్నందున తీసుకోవాల్సిన బందోబస్తు చర్యలు గురించి చర్చించారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండ చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీపీ ఆదేశించారు.
మరోవైపు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి భువనగిరి వస్తున్న నేపథ్యంలో భారీ స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు.
