Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే
ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి. పెద్ద వాళ్లను విమర్శిస్తే పెద్ద వాళ్లు కాలేరని అన్నారు.
![Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే Alleti Maheshwar Reddy : సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం..!- బాంబు పేల్చిన బీజేపీ ఎమ్మెల్యే](https://10tv.in/wp-content/uploads/2024/04/Alleti-Maheshwar-Reddy-2.jpg)
Alleti Maheshwar Reddy
Alleti Maheshwar Reddy : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. లోక్ సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిని మించి మరొకరు తీవ్ర వ్యాఖ్యలతో మంటలు పుట్టిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సీఎం రేవంత్ టార్గెట్ గా బీజేపీ నాయకులు చెలరేగిపోతున్నారు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సీఎం రేవంత్ ను ఉద్దేశించి మరో బాంబు పేల్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారాయన. సీఎం రేవంత్ రెడ్డికి ఆగస్ట్ సంక్షోభం తప్పదని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెప్పారు. జూన్ లో ఓటుకు నోటు కేసు విచారణ జరగనుందని తెలిపారు. గతంలో టీడీపీకి ఆగస్ట్ సంక్షోభం ఉండేది, అలానే రేవంత్ కు కూడా వస్తుందని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎల్లో కాలేజీకి చెందిన వ్యక్తే అని అన్నారు. రేవంత్ రెడ్డి ఏమీ కరెంట్ తీగ కాదు, వేరే వారు మల్లె తీగలు కాదన్నారు. రేవంత్.. మమ్మల్ని ముట్టుకుని చూడమను.. మేము ఏం తీగలో తెలుస్తుందన్నారు.
ప్రధాని మోడీని విమర్శించే స్థాయి రేవంత్ రెడ్డికి లేదన్నారు ఎమ్మెల్యే ఏలేటి. పెద్ద వాళ్లను విమర్శిస్తే పెద్ద వాళ్లు కాలేరని అన్నారు. ఆకాశం మీద ఉమ్మి వేస్తే అది తిరిగి మన ముఖం మీదే పడుతుందన్నారు.
Also Read : వారు అందరూ బీజేపీలోకి వస్తున్నారు.. చివరికి రేవంత్ రెడ్డి కూడా వస్తారు: ఎంపీ అర్వింద్