ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.

CM Revanth Reddy On Free Current And Gas Cylinders

CM Revanth Reddy : కోస్గి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఉచిత విద్యుత్, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ హామీని అమలు చేస్తామన్నారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతీ పేదవాడి ఇంటికి 200 యూపిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. అలాగే వారం రోజుల్లో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామన్నారు. ఇక, వచ్చే నెల 15వ తేదీలోపు ప్రతి రైతుకు డబ్బులు జమ చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసే బాధ్యత తీసుకుంటామన్నారు.

”వచ్చే వారం రోజుల్లోనే రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్తాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని అమలు చేస్తాం. వచ్చే నెల 16లోగా అందరికీ రైతుభరోసా అందిస్తాం. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటాం” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

”కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు. ఈ సభా వేదిక నుంచి కేసీఆర్ ను అడుగుతున్నా. తెలంగాణకు రెండుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు పాలమూరుకు చేసిందేంటి? పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదు? పాలమూరు జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వని నీకు ఓట్లు అడిగే అర్హత లేదు. ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్ కు సిగ్గు రాలేదు. అయ్యా కొడుకులు ఏ మొహం పెట్టుకుని పాలమూరు జిల్లాకు వస్తారు? పాలమూరును ఎండబెట్టి.. కొడంగల్ ను పడావు పెట్టి ఎడారి చేశారు.

70 ఏళ్ల మన గోస తీరుస్తానని మొన్నటి ఎన్నికల్లో మాట ఇచ్చా. ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నా. నారాయణపేట్-కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 2014లో నేను మంజూరు చేయించుకొచ్చా. కానీ కేసీఆర్ ప్రభుత్వం నారాయణపేట్-కొడంగల్ పథకాన్ని పదేళ్లు పడావు పెట్టింది. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, డీకే అరుణ, జితేందర్ రెడ్డిలను అడుగుతున్నా.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోడీ హామీ ఇచ్చారు. పదేళ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి. కృష్ణా రైల్వే లైన్ ఎందుకు ముందుకు సాగలేదని నేను అడుగుతున్నా. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా.. నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైనా తెచ్చారా? మరి పాలమూరు జిల్లాలో ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు?

కృష్ణా జలాలు కొడంగల్ రైతులకు అందించే పని మా ప్రభుత్వం చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో కొడంగల్ నుంచి 50వేల మెజారిటీ ఇవ్వండి. మళ్లీ 5వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. కాంగ్రెస్ కార్యకర్తలకు నేను పిలుపునిస్తున్నా. ఇది విరామం మాత్రమే.. ఇంకా యుద్ధం ముగిసిపోలేదు. 17 సీట్లలో 14 పార్లమెంటు స్థానాలు గెలిచినపుడే.. పార్లమెంటులో మనం పట్టు సాధించినపుడే యుద్ధం గెలిచినట్టు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలన్న బీఆర్ఎస్, బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఇతడే- సీఎం రేవంత్ రెడ్డి
మరోవైపు కోస్గి సభలో కీలక ప్రకటన చేశారు సీఎం రేవంత్ రెడ్డి. లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థి పేరుని ప్రకటించారాయన. మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీ చంద్ రెడ్డిని ప్రకటించారు రేవంత్. ఆయనను ఆశీర్వదించాలని, 50వేల మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ముఖ్యమంత్రి రేవంత్. రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్లను గెలిపించాలని, అందుకు సిద్ధమేనా అంటూ కార్యకర్తలను ఉద్దేశించి సీఎం రేవంత్ అన్నారు.

Also Read : ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు

 

ట్రెండింగ్ వార్తలు