×
Ad

Cold Waves : తెలంగాణలో పెరుగుతున్న చలి-వణుకుతున్న ఏజెన్సీ గ్రామాలు

తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతలగాలులతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు.

  • Published On : December 28, 2021 / 01:25 PM IST

Cold Waves in Telangana

Cold Waves : తెలంగాణలో గత కొద్ది రోజులుగా రాత్రి ఉష్ణో గ్రతలు తగ్గుముఖం పట్టాయి. శీతలగాలులతో ప్రజలు వణుకుతున్నారు. రాష్ట్రంలోని ఏజెన్సీ ఏరియాలో చలిపులికి గిరిజనులు వణుకుతున్నారు. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. చలికాలం ప్రారంభమైన రెండు నెలలు గడిచినా అంతగా చలి వేయలేదు…. కానీ వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, ఏజెన్సీ మండలాల్లోని గ్రామాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి.

అడవి ప్రాంతం కావడంతో చలి తీవ్రత మరింత అధికంగా ఉంటోంది. రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేవారు పొగమంచుతో ఇబ్బందులుపడుతున్నారు. ఉదయం 10 గంటల వరకు బయటకు రాలేని పరిస్థితి ఉంది. వృద్ధులు, చిన్నారులు, చల్లటి గాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే చలి తీవ్రత పెరుగుతుండడంతో వ్యాధులు కూడా పెరిగే అవకాశం ఉందని… జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలని… అవసరమైతే తప్ప చలిలో ఇంట్లో నుంచి బయటకు రావద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

మంచు కురుస్తుండడంతో ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది 163వ నెంబరు జాతీయ రహదారి పై ఉదయం ఎనిమిది గంటలు దాటినా లైట్ల వెలుగులో ప్రయాణం చేస్తున్నారు వాహనచోదకులు. మంచు బిందువులను చూసి ప్రకృతి ప్రేమికులు ఆనందిస్తున్నారు. విపరీతంగా మంచు కురుస్తుండడంతో ఉదయాన్నే పనికి వెళ్లే వారు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి.

మునుపెన్నడూ ఎరుగని రీతిలో చలి వణికిస్తోంది. ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయిలో పడిపోతుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. అర్ధరాత్రి అయ్యే సరికి ఉష్ణోగ్రత పడిపోతుండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోతున్నాయి. వెంకటాపురం వాజేడు ఏజెన్సీలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సాయంత్రం నాలుగు గంటలకే చలికోటు, చెవులకు వస్త్రాలను కప్పుకొని ప్రజలు బయట తిరగవలసి వస్తోంది.
Also Read : Hyderabad Real Estate : హైదరాబాద్ లో భారీగా పెరిగిన ఇంటి ధరలు-ప్రపంచ వ్యాప్తంగా 128వ స్ధానం
ఉన్ని వస్త్రాలు ధరించనిదే బయటకు రాలేకపోతున్నారు. ముఖ్యంగా గోదావరి తీర ప్రాంత గ్రామాల ప్రజలు, ఏజెన్సీ వాసులు గజగజలాడుతున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకూ చలి వీడడం లేదు. రాత్రిపూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. గతంలో రాత్రి పదకొండు గంటల వరకూ జనసంచారం ఉండే వెంకటాపురంలో ఇప్పుడు 8 గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అదేవిధంగా ఉదయం తొమ్మిది గంటల యితే కానీ ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ఏజెన్సీలో కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి నానాటికీ అమాంతంగా పడిపోవడంతో గిరిజనులు గజగజలాడుతున్నారు.చలి నుంచి రక్షణ పొందేందుకు స్వెట్టర్లు, ఉన్ని కోట్లు, రగ్గులు, జర్కిన్లు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. చలి మంటలు, కుంపట్ల వద్ద కాలక్షేపం చేస్తున్నారు. మరో వైపు చలికి దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి. కొంతమంది వైరల్ జ్వరాల బారిన పడుతున్నారు. ఇక ఉబ్బసం, ఆస్తమా, టీబీ రోగులు నానా అవస్థలు పడుతున్నారు. చలికాలంలో ఎక్కువుగా వృద్ధులు, పిల్లలు న్యుమోనియా వ్యాధికి గురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా రక్తపోటు పెరిగి గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది. చర్మం పొడిబారిపోతుంది. సోరియసిస్ వంటి చర్మవ్యాధుల తీవ్రత ఎక్కువవుతుంది. అదేవిధంగా మంచు ఎక్కువుగా పడడం వల్ల గొంతు సంబంధిత వ్యాధులు ప్రజలను బాధిస్తున్నాయి.