×
Ad

కాంగ్రెస్‌లో పదవుల జాతర.. పార్టీ, క్యాబినెట్, నామినేటెడ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నది వీరే..

నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా.. ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు.

  • Published On : August 12, 2024 / 07:46 PM IST

Cabinet Nominated Posts : తెలంగాణలో కాంగ్రెస్ కు కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా. టీపీసీసీలో పదవుల పండగ ఉండబోతోందా. పార్టీ పదవులతో పాటు కేబినెట్, నామినేటెడ్ పోస్టులు, పదవుల భర్తీపైన కసరత్తు జరుగుతోందా. పార్టీ పదవులు ఎవరిని వరించనున్నాయి. పదవుల భర్తీపై ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొందా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీ ప్రక్రియపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి బుధవారం హైదరాబాద్ రానున్నారు. సీఎం రాగానే పదవుల భర్తీపై కసరత్తు మొదలు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీ తర్వాత టీపీసీసీలో పదవుల పండగ ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు. పీసీసీ చీఫ్ పదవి కోసం కసరత్తు పూర్తైనట్లు, పీసీసీ చీఫ్ గా బీసీ సామాజికవర్గం నుంచి మధుయాష్కి గౌడ్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక వర్కింగ్ ప్రెసిడెంట్లుగా.. అన్ని ప్రధాన సామాజికవర్గ నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వర్కింగ్ ప్రెసిడెంట్ విత్ ఆర్గనైజేషన్ గా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రచార కమిటీ ఛైర్మన్ గా జగ్గారెడ్డిని నియమించనున్నట్లు సమాచారం. అంతేకాకుండా పలువురు కీలక నేతలకు ఏఐసీసీ కార్యదర్శులుగా ప్రమోషన్ వచ్చే సూచనలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా కేబినెట్ విస్తరణ కోసం కసరత్తు పూర్తైనట్లు సమాచారం. ఖాళీగా ఉన్న 6 క్యాబినెట్ బెర్తులలో 4 మంత్రి స్థానాలను భర్తీ చేసేందుకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. రెండు బెర్తులను ఖాళీగా ఉంచనున్న కాంగ్రెస్ హైకమాండ్.. సామాజికవర్గాలను దృష్టిలో పెట్టుకుని క్యాబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది.

మంత్రి పదవుల రేసులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్, ప్రేమ్ సాగర్ రావు, మల్ రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, బాలు నాయక్, మదన్ మోహన్ రావు పోటీలో ఉన్నారు. నామినేటెడ్ పదవుల కోసం పలువురు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొన్ని కార్పొరేషన్ పదవులు ఇవ్వాలనే యోచనలో కాంగ్రెస్ పెద్దలు ఉండగా.. ఎన్నికల తర్వాత మరికొన్ని పదవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. మొత్తంగా టీపీసీసీలో పార్టీ పదవులతో పాటు కేబినెట్, నామినేటెడ్ పోస్టులు ఎవరిని వరిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read : సబిత Vs సీఎం రేవంత్‌.. అసలు ఎవరు ఎవరిని మోసం చేశారు, ఇద్దరికీ ఎక్కడ చెడింది? మాజీ మంత్రి సబితతో వీకెండ్ ఇంటర్వ్యూ