Huzurabad Bypoll : కాంగ్రెస్ నుంచే పోటీ..కేటీఆర్తో భేటీపై కౌశిక్ రెడ్డి క్లారిటీ
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోందని, ఇందులో రాజకీయ కోణం లేదన్నారు కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి. తన చిన్ననాటి మిత్రుడు తండ్రి చనిపోయాడని, దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా..మంత్రి కేటీఆర్ రావడం జరిగిందన్నారు.
- madhu
- Updated on- September 24, 2022 / 05:17 PM IST
Huzurabad Trs
KTR And Koushik Reddy : హుజూరాబాద్ నియోజకవర్గం పాలిటిక్స్ రోజుకో మలుపు తీసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధం అవుతుండడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. అయితే..టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో..మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్లతో హుజూరాబాద్ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డి భేటీ కావడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నారన్న ప్రచారం జరిగిపోయింది. మంత్రి కేటీఆర్తో కౌశిక్ రెడ్డి దిగిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీంతో కౌశిక్ రెడ్డి స్పందించారు.
సోషల్ మీడియాలో ఓ ఫొటో వైరల్ అవుతోందని, ఇందులో రాజకీయ కోణం లేదన్నారు. తన చిన్ననాటి మిత్రుడు తండ్రి చనిపోయాడని, దశదినకర్మ కార్యక్రమంలో భాగంగా..మంత్రి కేటీఆర్ రావడం జరిగిందన్నారు. తాను కూడా అక్కడే ఉన్నానని, రాజకీయ కోణం చూడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేయడం జరుగుతుందని, హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమనే ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ కోణంలో చూడొద్దని ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరనే సంగతి తెలిసిందే. ఎవరూ ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు. చెప్పినట్లుగా కాంగ్రెస్ అభ్యర్థిగా కౌశిక్ రెడ్డి బరిలోకి దిగుతారా ? లేక ప్రచారం జరుగుతున్నట్లుగా టీఆర్ఎస్లోకి జంప్ అవుతారా ? అనేది రానున్న రోజుల్లో తెలియనుంది.
Read More : Prabhas – Prashanth Neel : ‘బాహుబలి’ని మించి ప్రభాస్ – ప్రశాంత్ నీల్ సినిమా..
