Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో మోదీని గద్దె దించేందుకు పునాది : రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు.

Revanth Reddy

TPCC President Revanth Reddy : బిడ్డలు కష్టంలో ఉంటే జీసెన్ త్యాగం చేసినట్లు.. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ త్యాగం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చరిత్రను మనం ప్రస్తావించాల్సి వస్తే క్రీస్తు శకం.. క్రీస్తు పూర్వం అని ప్రస్తావిస్తామని, అలాగే తెలంగాణ సమస్యల్ని ప్రస్తావించాల్సి వస్తే తెలంగాణ వచ్చాక.. తెలంగాణ రాకముందు అని చెబుతామని తెలిపారు.

సోమవారం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ క్రిస్టియన్ కమ్యూనిటీ డిక్లరేషన్ ఫర్ పొలిటికల్ పార్టీస్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొని, మాట్లాడారు.  రాష్ట్రంలో పదేళ్లుగా స్వేచ్ఛ ఉందా? అని ప్రశ్నించారు. మనం ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చూసి భయపడే పరిస్థితి నెలకొందన్నారు. మణిపూర్ లో జరిగిన దాడులను చూసైనా ప్రజలు ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. ఓడిన వారు బానిసలు అన్నట్లుగా మోదీ ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు.

డిసెంబర్ అంటే మిరాకిల్ నెల అని అన్నారు. 2023 డిసెంబర్ లో ఒక మిరాకిల్ జరగబోతుందని తెలిపారు. ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ, సమానత్వం, సమాన అభివృద్ధి అని అన్నారు. కాంగ్రెస్ ఏం చేసిందని కొందరు ప్రశ్నిస్తున్నారు.. ఇది కాంగ్రెస్ పై జరుగుతున్న పాశవిక దాడికి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలన్నారు.

Also Read: కాంగ్రెస్ గ్యారెంటీలపై కుమారస్వామి కీలక వ్యాఖ్యలు.. కౌంటర్ ఇచ్చిన హస్తం పార్టీ

తెలంగాణలో జరిగే ఎన్నికలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికే కాదన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఢిల్లీలో మోదీని గద్దె దించేందుకు పునాది అని అన్నారు. తెలంగాణలో గెలవడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యతను మరింత సమర్ధవంతంగా నిర్వర్తిస్తామని పేర్కొన్నారు. నిన్న కర్ణాటక, నేడు తెలంగాణ, రేపు ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలని ఆకాంక్షించారు.

ట్రెండింగ్ వార్తలు