telangana minister harish rao : తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావుకు కరోనా వైరస్ సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతరులు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం సూచించింది.
దీంతో మంత్రి హరీష్ రావు కూడా కరోనా టెస్టింగ్స్ చేయించుకున్నారు. పాజిటివ్ గా ఫలితం వచ్చింది. తనతో కాంటాక్టు అయిన వారు పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని మంత్రి హరీష్ వెల్లడించారు.
On getting initial symptoms of coronavirus, I got the test done and the report came back positive. My health is fine, I request that all those who have come in contact with me in the last few days, please isolate yourself and get Covid Test done
— Harish Rao Thanneeru #StayHome #StaySafe (@trsharish) September 5, 2020
అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ టెస్టులు చేయించుకోవాలన్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. 6వ తేదీ నాటికి రిపోర్టు వచ్చేలా చూసుకోవాలన్నారు. పాజిటివ్ ఉంటే సమావేశాలకు రావొద్దని ఆయన ఎమ్మెల్యేలకు సూచించారు. కరోనా లక్షణాలున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశాలకు దూరంగా ఉండాలని మండలి చైర్మన్ గుత్తా సూచించారు.
సమావేశాల సందర్భంగా ధర్నాలు, నిరసనలు, చలో అసెంబ్లీ కార్యక్రమాలను నిర్వహించకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సభలో చర్చకు వచ్చే అంశాలపై అధికారులు సమగ్ర సమాచారంతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఈనెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. శాసనసభ, మండలి సభ్యులు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, పోలీసులు, పోలీస్ మార్షల్స్తో పాటు… మంత్రుల వెంట వచ్చే పీఏలు, పీఎస్లు తప్పనిసరిగా టెస్టులు చేయించుకోవాలన్నారు స్పీకర్. 6వ తేదీకల్లా రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని సూచించారు.
అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన ఏర్పాట్లపై స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి.. అసెంబ్లీ అధికారులు, పోలీసు అధికారులతో వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అక్కడి వైద్యులతో కరోనా పరీక్షలు చేయించాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించినట్లు స్పీకర్ పోచారం చెప్పారు.
మంత్రుల పీఎస్లు, పీఏలకు మాత్రమే సభలోకి అనుమతి ఉందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పీఏలు, ఇతర వ్యక్తిగత సిబ్బందిని అనుమతించబోమని వెల్లడించారు. అసెంబ్లీ అన్ని ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ యంత్రాలు అందుబాటులో పెడతామన్నారు. జ్వరం ఉన్న వారిని అసెంబ్లీలోకి అనుమతించబోమని.. జలుబు, దగ్గుతోపాటు ఇతర లక్షణాలున్న వారు కూడా అసెంబ్లీకి రాకూడదని స్పీకర్ స్పష్టం చేశారు.
మాస్కులు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతిస్తామని, అసెంబ్లీ ప్రవేశ ద్వారాల వద్ద మాస్కులు అందుబాటులో ఉంచుతామని తెలిపారు.
పార్లమెంటు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు అనుసరిస్తున్న నిబంధనలకు అనుగుణంగానే శాసనసభ సమావేశాలు జరుగుతాయని పోచారం తెలిపారు. అయితే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మీడియాకు పరిమిత సంఖ్యలో పాస్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
సందర్శకులకు అనుమతి లేదని, మీడియా పాయింట్, లాబీపాస్లు జారీ చేయడం లేదన్నారు. చర్చల సమయంలో సభ్యులు తమకు కేటాయించిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోచారం పిలుపునిచ్చారు. ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఆక్సీమీటర్, శానిటరీ బాటిల్, మాస్క్తో కూడిన కిట్లను అందజేస్తామని స్పీకర్ పోచారం వెల్లడించారు.
మున్సిపల్, పబ్లిక్ హెల్త్, జీహెచ్ఎంసీ ద్వారా అసెంబ్లీ సమావేశ మందిరాలతో పాటు పరిసరాలను రోజుకు రెండు సార్లు శానిటైజ్ చేస్తామన్నారు. సభ్యుల కోసం అసెంబ్లీ ఆవరణలో 2 డయాగ్నస్టిక్ కేంద్రాలు, అంబులెన్సులు, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఉభయ సభల్లో భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ అరెంజ్మెంట్స్ చేశారు. శాసనసభలో అదనంగా 40, మండలిలో 8 సీట్లు ఏర్పాటు చేశారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 20 రోజుల పాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ ఖరారు చేసింది. సభలో చర్చకు వచ్చే అంశాల సమగ్ర సమాచారం సిద్ధం చేసుకోవాల్సిందిగా అధికారులను స్పీకర్ , చైర్మన్ ఆదేశించారు. గతంలో మాదిరిగా అధికారులను గుంపులుగా కాకుండా, శాఖల వారీ ముఖ్యమైన వారిని మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు.
పోలీసు అధికారులతో జరిగిన సమావేశంలో భద్రతపరమైన అంశాలు, బందోబస్తుపై చర్చించారు.ఎస్పీఎఫ్ డీజీతో పాటు ఇతర ఉన్నతాధికారులు, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ పాల్గొన్నారు.