Road Accident : ఘోర ప్రమాదం.. జాతీయ రహదారిపై కారులో చెలరేగిన మంటలు.. వైద్యుడు సజీవదహనం
Road Accident : సూర్యాపేట సమీపంలో హైదరాబాద్ - ఖమ్మం జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
- Harish Thanniru
- Published on- September 20, 2026 / 11:36 AM IST
Road Accident
Road Accident : సూర్యాపేట సమీపంలో జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం – హైదరాబాద్ జాతీయ రహదారిపై పిల్లలమర్రి వద్ద కారు డివైడర్ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన కొద్ది నిమిషాల్లోనే కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యారు.
Also Read : Singareni Workers : సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. నెరవేరనున్న కల.. రెవెన్యూ శాఖ ఉత్తర్వులు
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదానికి గురైన కారును పరిశీలించిన పోలీసులు మృతుడిని డా. కాసకుర్తి జగదీశ్గా గుర్తించారు. మృతుడు ఖమ్మంలోని మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. జాతీయ రహదారిపై ఖమ్మం వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
కారు రోడ్డు మధ్యలోని డివైడర్ను అత్యంత వేగంగా, బలంగా ఢీకొట్టడం వల్లనే కారులో మంటలు చెలరేగాయని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన అతికొద్ది నిమిషాల్లోనే ఆ మంటలు వాహనం నలువైపులా వ్యాపించడంతోపాటు.. డోర్లు లాక్ అయిపోవడంతో బయటకు వచ్చే పరిస్థితిలేక కారులోనే వైద్యుడు సజీవదహనం అయినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే, ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
కారు పూర్తిగా దగ్దమైపోవటంతో లోపల ఉన్న వైద్యుడి శరీర భాగాలుసైతం పూర్తిగా కాలిపోయాయి. దీంతో మృతి చెందిన వ్యక్తి ఎవరనేది గుర్తించడం పోలీసులకు తొలుత కష్టంగా మారింది. కారు నంబర్, ప్రాథమిక ఆధారాల ద్వారా పరిశీలన జరిపిన పోలీసులు మృతుడిని వైద్యుడు కాసుకుర్తి జగదీశ్ గా గుర్తించారు. ఆయన ఖమ్మంలోని ప్రముఖ మమత ఆస్పత్రిలో న్యూరో సర్జన్ గా సేవలు అందిస్తున్నారు. వైద్యుడి మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. తోటి వైద్యులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
