etela rajender breakfast meeting : ఎంపీ టికెట్ల రేసు తెలంగాణ బీజేపీలో కాకపుట్టిస్తోంది. ఒక్కో సీటు నుంచి నలుగురైదుగురు నేతలు టికెట్ కోసం పోటీ పడుతుండటంతో ఎవరికి టికెట్ దక్కుతుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఆశావాహులు కూడా టికెట్ తమకే వస్తుందని చెప్పుకోలేకపోతున్నారు. మాజీమంత్రి ఈటల రాజేందర్ మాత్రం.. మల్కాజ్ గిరి టికెట్ తనకే కన్ఫామ్ అయిందంటూ కార్యకర్తలు, నేతలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేయడం ఆసక్తికరంగా మారింది.
Read Also : AP Politics : వైసీపీ జోరు, విపక్షం బేజారు.. ఏపీ రాజకీయాల్లో ఏం జరగనుంది..?
మాజీమంత్రి ఈటల రాజేందర్.. బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ తెలంగాణ బీజేపీలో కలకలం రేపుతోంది. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ కన్ఫామ్ అయిందంటూ మెస్సేజ్ లు పంపి.. కార్యకర్తలు, నేతలను బ్రేక్ ఫాస్ట్కు పిలిచారు ఈటల. ఈ మీటింగ్ కాస్తా ఇప్పుడు తెలంగాణ కమలం పార్టీలో హాట్ టాపిక్గా మారింది.. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఆశించిన నేతలతో పాటు పలువురు లీడర్లు ఈటల మీటింగ్ తో కన్ఫ్యూజన్ లో పడ్డట్లు తెలుస్తోంది. ఈటల బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. ఈ మీటింగ్ విషయం తెలిసి మరికొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఎంపీగా పోటీ చేసేందుకు ఈటల ఆసక్తి :
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై ఆసక్తి చూపిస్తున్నారు ఈటల రాజేందర్. ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి గెలవాలని భావిస్తున్నారు. ముందుగా కరీంనగర్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ ని జహీరాబాద్ లొక్ సభ స్థానానికి పంపించి ఆయన కరీంనగర్ నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో ఆయన కన్ను మల్కాజ్ గిరి లోక్ సభ స్థానంపై పడింది. కానీ అప్పటికే అక్కడ నుండి పోటీ చేసేందుకు మురళీధర్ రావు రెండు ఏళ్ల నుంచి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అదే విధంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అధినేత మల్క కొమురయ్య.. మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ కూడా మల్కాజ్ గిరి బరిలో నిలవాలనుకుంటున్నారు. ఐతే అధిష్ఠానం ఆదేశిస్తే మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసేందుకు సిద్దమంటూ ఈటల రాజేందర్ పలు దఫాల్లో ప్రకటించారు. ఇది అప్పట్లో ఆ స్థానం నుండి టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలను అసహనానికి గురిచేసింది.
ఆ తర్వాతే తుది పేరు ఖరారు :
బీజేపీలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల ఎంపికకు ఒక సిస్టం అనేది ఉంటుంది. ముందుగా రాష్ట్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఒక్కో నియోజక వర్గానికి మూడు పేర్లను ఎంపిక చేసి జాతీయ నాయకత్వానికి పంపిస్తుంది. ఆ తర్వాత బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ సమావేశమై తుది పేరును ఖరారు చేస్తుంది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిటీ సమాశమై ఆశావాహుల జాబితాను షార్ట్ లిస్ట్ చేసింది. రేపు జాతీయ ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కానీ దీనికి ఒకరోజు ముందే ఈటల రాజేందర్ ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పార్టీలో కలకలానికి దారి తీసింది. తనకే మల్కాజ్ గిరి సీట్ ఖరారు అయ్యిందని చెబుతూ ఈటెల ఏర్పాటు చేసుకున్న ఈ సమావేశం కాస్తా ఇదే స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలను కన్య్ఫూజన్ లోకి నెట్టింది. జాతీయ నాయకత్వం ఏమైన మల్కాజ్ గిరిలో పనిచేసుకోవాలని ఈటల రాజేందర్ కు హింట్ ఇచ్చిందా అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ అధికారికంగా పేరును ప్రకటించక ముందే ఈయన మీటింగ్ ఏర్పాటు చేయడం ఏంటని టికెట్ ఆశిస్తున్న ఇతర నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆ రెండు స్థానాల్లో పోటీ చేసేది ఎవరో? :
మల్కాజ్ గిరి సీట్ ప్రకటనపై మరో రెండు స్థానాలలో ఎవరు పోటీ చేస్తారనేది ఆధారపడి ఉంది. ఈటల రాజేందర్ మల్కాజ్ గిరి నుంచి కాకపోతే మెదక్ లేదా జహీరాబాద్ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. మల్కాజ్ గిరి నుంచి ఈటలకు కన్ఫామ్ అయితే మెదక్ నుంచి రఘునందన్ , జహీరాబాద్ నుంచి టికెట్ ఆశించే ఇతర నాయకులకు లైన్ క్లియర్ అయినట్టే. అయితే ఉదయం బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ విషయం తెలిసిన మెదక్ , జహీరాబాద్ టికెట్ ఆశిస్తున్న నేతలు తమకు అడ్డంకులు తొలగాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పై పార్టీ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా టికెట్ తమకే వస్తుందనుకున్నా చివరి వరకు ఆ నేతలు ఆ విషయాన్ని గోప్యంగా ఉంచుతారు. కానీ అందుకు భిన్నంగా టికెట్ తనకే అంటూ బీజేపీ జాతీయ ఎన్నికల కమిటీ రావడానికి ఒక్క రోజు ముందు ఈటెల ఇలా మీటింగ్ పెట్టడం ద్వారా జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెంచేందుకే అన్న అభిప్రాయం సైతం వ్యక్తం అవుతోంది. మొత్తానికి ఈటల రాజేందర్ ఏర్పాటు చేసిన బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ పార్టీలో కలకలానికి కన్ఫ్యూజన్ కి దారి తీసింది.
Read Also : Chevella Congress MP Candidate : చేవెళ్లకు కొత్త చెల్లెమ్మ..! కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆమేనా?