Ktr : ఒక్కోసారి ఓడిపోవటం కూడా మంచిదే- బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ హాట్ కామెంట్స్

అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు.

Ktr : అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపై మాజీమంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కోసారి ఓడిపోవటం కూడా మంచిదే అని కేటీఆర్ అన్నారు. మార్పు అని లొల్లి పెట్టగానే ఎవరికో ఓటు వేశారు, మార్పు కావాలని అనుకున్నారు. కానీ ఏమైంది? అని కేటీఆర్ ప్రశ్నించారు. కరెంట్ పోతుందా? నీళ్లకు గోస అయితుందా? ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి వచ్చింది అని అన్నారు. కేసీఆర్ పాలననే బాగుండే అని అనిపిస్తోందా? అని అడిగారు.

”రేవంత్ రెడ్డి 420 హామీలు ఇచ్చారు. అరచేతిలో వైకుంఠం చూపించారు. రుణమాఫీకి సంబంధించి ఇప్పుడు దేవుళ్ల మీద ఒట్టేసి కొత్త నాటకం చాలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మోసం పార్ట్-1 చూపించి ఓట్లేయించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పుడు మోసం పార్ట్-2 స్టార్ట్ చేశారు. దేవుళ్ల మీద ఎందుకు ఒట్టు పెడుతున్నారు రేవంత్ రెడ్డి? మీ భార్య, పిల్లల మీద ఎందుకు ఒట్టేయవ్? అంటే దేవుళ్లు అడగరు కదా? వాళ్లను ఈజీగా మోసం చేయవచ్చు.

ఢిల్లీ బడేభాయ్. హైదరాబాద్ లో కేడీ. ఇద్దరు మోసగాళ్లు. ఆ బడే భాయ్ మాటలు విని మనం మోసపోయామ్. ఇక్కడ చోటే భాయ్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో హామీలిచ్చి మోసం చేశాడు. పార్లమెంటులో వినోదన్న ఉంటే మన సమస్యలను గల్లా పట్టి అడుగుతారు. బండి సంజయ్ ఎప్పుడైనా కోనరావు పేటలో కనిపించారా? టీవీలో తప్ప ఎక్కడైనా కనబడ్డరా? ఈ ప్రాంతానికి బుడ్డా పైసా పనిచేశారా? పార్లమెంటులో ప్రశ్నలు అడిగిరా? ఏం చేశావ్ బండి సంజయ్ మా ప్రాంతానికి అంటే జై శ్రీరామ్ అంటారు.

అక్షింతలు పంపించి దేవుడిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. శ్రీరాముడు మనకు దేవుడు కాదా? బండి సంజయ్ రాకముందు మనకు దేవుడు తెల్వదా? రాముని పేరు చెప్పి రామున్ని వీళ్లే కాపాడుతున్నట్లు పిల్లల మనసును కరాబ్ చేస్తున్నారు. బీజేపీ ఓడిపోతే దేశంలో, రాష్ట్రంలో ఉన్న దేవుళ్లకు అయ్యేది ఏమీ లేదు. బీజేపీకి ఓటు వేస్తే దేవునికి ఓటు వేసినట్లే అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అమిత్ షా చెప్పులు మోసుడు తప్ప.. ఐదేళ్లలో బండి సంజయ్ చేసిందేమీ లేదు? బండి సంజయ్ నీకు దమ్ముంటే ఏం పని చేసినవో చెప్పేందుకు చర్చకు రా. రాజన్న గుడికి, కొండగట్టు అంజన్నకు ఒక్క రూపాయి తెచ్చినవా? ఒక్క బడి లేదు, గుడి లేదు, పరిశ్రమ తేలేదు. అలాంటిది నీకు ఎందుకు ఓటు వేయాలే. అడిగితే గాలి తిరుగుడు తప్ప చేసిందేమీ లేదు.

కేసీఆర్ ని మళ్లీ తెచ్చుకుందామా? 10 నుంచి 12 సీట్లు మాకు అప్పగించండి. ఏడాది లోపు మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారు. ఒక్కోసారి ఓడిపోవటం కూడా మంచిదే. సిరిసిల్లలో ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకనాడు సిరిసిల్లను ఉరిసిల్ల చేసిన కాంగ్రెస్ మళ్లీ అదే పని చేస్తోంది. కాంగ్రెస్ రాగానే రైతులు, నేతన్న ఆత్మహత్యలు, కరెంట్ పోవుడు, మోటార్లు కాలుడు మళ్లీ స్టార్ట్ అయ్యాయ్. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేరాలంటే, వాళ్ల పేయిల భయం ఉండాలంటే బీఆర్ఎస్ గెలవాలి” అని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని కోనరావు పేట్ లో బీఆర్ఎస్ అభ్యర్ధి వినోద్ కుమార్ కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షో లో కేటీఆర్ పాల్గొన్నారు.

Also Read : బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ, కారు ఇక తూకానికే- సీఎం రేవంత్ రెడ్డి

ట్రెండింగ్ వార్తలు