అక్కడ తప్పకుండా ఉపఎన్నిక వస్తుంది, బీజేపీతో కలిసుంటే కవిత జైల్లో ఎందుకుంటుంది- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయాం. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది.

Ktr (Photo Credit : Google)

KTR : స్టేషన్ ఘన్ పూర్ లో తప్పకుండా ఉప ఎన్నిక వస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాజయ్య గెలుపునకు ఇది మొదటి అడుగు అని చెప్పారు. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేసి ఉందని, మనకు సానుకూలంగా వస్తుందనే నమ్మకం ఉందని కేటీఆర్ చెప్పారు. హైకోర్టులో ముగ్గురు ఎమ్మెల్యేలపై తీర్పు రిజర్వ్ లో ఉందని, మిగిలిన వారిపై సుప్రీంకోర్టుకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామన్నారు కేటీఆర్. దేశంలో రాజకీయ పరిస్థితులు చూస్తే మూడోసారి అధికారం రావడం ఇబ్బందే అని చెప్పుకొచ్చారు. 14 స్థానాల్లో తక్కువ ఓట్లతో ఓడిపోయామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ఒకే ట్రెండ్ కనిపించిందన్నారు. ఎన్డీయే, ఇండియా కుటమిలలో లేని పార్టీలకు పెద్దగా రాలేదన్నారు.

”కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 9 నెలల్లో కాంగ్రెస్ పాలనలో కరెంట్ మాయమైంది. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత రేవంత్ కు దక్కింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని 2 ఉద్యోగాలు రేవంత్, రాహుల్ దక్కించుకున్నారు. జాబ్ క్యాలండర్ పేరుతో కాంగ్రెస్ తప్పించుకుంటోంది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

బీఆర్ఎస్ ది కుటుంబ పాలన అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఎటు చూసినా రేవంత్ సోదరులే కనిపిస్తున్నారు. ఓ తమ్ముడు ఆస్ట్రేలియాలో బృందంతో పర్యటిస్తున్నారు. మరో సోదరుడు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారట. రేవంత్ బావమారిది సృజన్ కు వెయ్యి కోట్ల పనులు ఇచ్చారు. కాంగ్రెస్ బాగోతాలు బయటకు వస్తున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ ను తట్టుకునే పరిస్థితి కాంగ్రెస్ కు లేదు. రేవంత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారు. కాగ్నిజెంట్ 2019లోనే ఒప్పందం చేసుకుంది. సమయం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై వత్తిడి పెంచుతాము.

కవిత జైలు కెళ్ళి 150 రోజులైంది. కవిత బెయిల్ కోసం అన్నగా ఢిల్లీ వెళ్ళాను. బీజేపీతో బీఆర్ఎస్ విలీనం అవుతుందని తప్పుడు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ నేతలు ఎవరైనా జైల్లో ఉన్నారా? బీజేపీతో మేము కలిసి ఉంటే 150 రోజులు జైల్లో కవిత ఎలా ఉంటుంది? త్వరలోనే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తాము. త్వరలోనే పార్టీ పదవులు కూడా ఇస్తాం. నియోజకవర్గాల వారీగా కేసీఆర్ కలుస్తారు. ముందు స్టేషన్ ఘన్ పూర్ వాళ్ళనే కలిపిస్తాం.

బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు రేవంత్ నిర్వహిస్తారుట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి. ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్ర స్థాయిలో ఎండగట్టాలి. కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లలేని పరిస్థితులు వస్తాయి” అని కేటీఆర్ అన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు