Godavari Flood: వరద గోదావరి.. వందేళ్లలో తొలిసారిగా..
భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీరు పోటెత్తుతోంది.
- Harishth Thanniru
- Published On : July 13, 2022 / 10:21 AM IST
Godavari
Godavari Flood: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ పెరుగుతోంది. బుధవారం ఉదయం 7.30గంటల సమయానికి 51.20 అడుగులకు చేరింది. మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వస్తున్న గోదావరి నీటిమట్టం.. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి వరదనీరు పోటెత్తుతోంది. దీంతో మళ్లీ గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించిన అధికారులు.. వారు అప్పుడే తిరిగి గ్రామాలకు చేరుకోవద్దని సూచిస్తున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 13,31,102 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది.
Kadem Project: ప్రమాదపుటంచున కడెం ప్రాజెక్టు.. రెడ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు
భద్రాచలం వద్ద రెండురోజులుగా గోదావరి ఉగ్రరూపం దాల్చి ఏజెన్సీ ప్రాంతాల ప్రజలకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. సోమవారం అర్థరాత్రి గోదావరి నీటిమట్టం 53.90 అడుగులకు చేరుకుంది. అయితే మంగళవారం ఉదయం నుంచి తగ్గుముఖం పడుతూ వచ్చింది. మంగళవారం అర్థరాత్రి సమయానికి 51.20 అడుగుల వద్దకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా మళ్లీ గోదావరి నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలాఉంటే వందేళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనట్లుగా జులై నెలలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. సాధారణంగా జులై నెలలో గోదావరికి వరదలు వచ్చినా ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదు. జులైలో వరదలు వచ్చినా లక్ష క్యూసెక్కుల లోపే ఉండేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆ రికార్డును ప్రస్తుతం వరదలు బ్రేక్ చేసినట్లు కనిపిస్తుంది. 13లక్షల క్యూసెక్కులకుపైగా వరద ప్రవాహం గోదావరిలో కొనసాగుతోంది. ఇది క్రమంగా పెరుగుతోంది. పోలవరం దగ్గర గోదావరికి రికార్డు స్థాయి వరద వచ్చిందని అధికారులు చెబుతున్నారు. పోలవరం వద్ద 48గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదులుతున్నారు.
Godavari Sub-Rivers : గోదావరికి భారీగా వరద ఉధృతి..ఉగ్రరూపం దాల్చిన ఉపనదులు
మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి ఉరకలెత్తుతోంది. దీంతో ధర్మపురం పట్టణంలోకి వరదనీరు ప్రవేశించింది. పలు కాలనీలు జలమయమయ్యాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. ధర్మపురం పరిసర ప్రాంతాల్లో పంట పొలాలు నీటమునిగాయి. బీర్పూర్ మండలం కమ్మునూర్ వద్ద గోదావరి వరద తీవ్రతకు అక్కడ స్మశానం పూర్తిగా మునిగిపోయింది. వర్షాల ధాటికి పలు ప్రాంతాల్లో ఇళ్లు నేలమట్టమయ్యాయి.
