Drug Party : ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ.. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, టీడీపీ ఎంపీ సహా పలువురు వీఐపీలు.. ఐదుగురికి పాజిటివ్..
Gunfire in moinabad farmhouse drug party : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు.
- Harishth Thanniru
- Published On : March 15, 2026 / 07:07 AM IST
Gunfire in moinabad farmhouse drug party
- మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ
- ఈగల్ టీం, ఎస్ఓటీ పోలీసులు దాడులు
- మఫ్టీలో ఉన్న పోలీసులపైకి కాల్పులు
- రోహిత్ రెడ్డితోపాటు ఐదుగురికి పాజిటివ్
- కొకైన్, మద్యం, గన్ స్వాధీనం
Gunfire in moinabad farmhouse drug party : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో డ్రగ్స్ పార్టీ కలకలం సృష్టించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ టీమ్, ఎస్ఓటీ, స్థానిక పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపాడు. అయితే, ఈ డ్రగ్స్ పార్టీలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీలోని ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు ఉన్నారు. వారికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ మీడియాకు తెలిపారు.
Also Read : KTR: సుందరీకరణ పేరుతో ఇళ్లు కూల్చొద్దు, రెండేళ్లు మీ ఆస్తులు కాపాడుకోండి- కేటీఆర్
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్ ప్రాంతంలోని బీఎంఆర్ ఫామ్ హౌస్లో మద్యం, డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో శనివారం రాత్రి 9.30గంటల సమయంలో ఈగల్ టీమ్ , ఎస్వోటీ, స్థానిక పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమీద్ మిశ్రా కాల్పులు జరిపారు. అయితే, గన్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డిదిగా గుర్తించారు. ఈ పార్టీలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ యాదవ్, నమీద్ మిశ్రా, యం. రమేష్, శ్రవణ్ కుమార్, విజయ్ కృష్ణ, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డితోపాటు ఓ మహిళ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
డ్రగ్స్ పార్టీలో రెండు గ్రాముల వైట్ పౌడర్ను సీజ్ చేశారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన వారికి డ్రగ్ టెస్టు కిట్ ద్వారా పరీక్ష నిర్వహించగా రోహిత్ రెడ్డితోపాటు నమీద్ మిశ్ర, రితేష్ రెడ్డి, కాసిక్ రవి, అర్జున్ రెడ్డిలకు పాజిటివ్ వచ్చింది. నిర్ధారణ కోసం బ్లెడ్ శాంపిల్స్ ను ఆస్పత్రికి పంపించారు. ఇదిలాఉంటే.. ఈ ఘటన జరిగింది మాజీ ఎమ్మెల్యేకు చెందిన ఫామ్ హౌస్ కావడం, గతంలోనూ ఇక్కడ ఇలాంటి పెద్ద కేసే నమోదు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా ఉన్నవారెవరు.. పరోక్షంగా ఉన్నవారెవరనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోందని సమాచారం.
