బీఆర్ఎస్‌ పార్టీకి మరో బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన గద్వాల్ ఎమ్మెల్యే

గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

BRS MLA Bandla Krishna Mohan Reddy Joins Congress

BRS MLA Bandla Krishna Mohan Reddy : బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. తాజాగా మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. గద్వాల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి గత కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతుంది. అయితే, ఆయన్ను కాంగ్రెస్ లో చేర్చుకోవద్దని గద్వాల జడ్పీ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, వారి అనుచరులు ఆందోళనకు దిగారు. కొందరు ఏకంగా సెల్ టవర్ ఎక్కి నిరసన తెలపడంతోపాటు, పెట్రోల్ పోసుకుంటామని హెచ్చరించారు. గతంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిని ఎలా చేర్చుకుంటారని కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించారు.

Also Read : Traffic Restrictions : బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ ఆంక్షలు.. ఎప్పటి వరకంటే?

వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కార్యకర్తలు ససేమిరా అంనడంతో.. సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకిదిగి సరితా తిరుపతయ్యతోపాటు స్థానిక కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడినట్లు తెలిసింది. కృష్ణ మోహన్ రెడ్డి పార్టీలోకి వచ్చినా మీకు సముచిత స్థానం ఇస్తామని సరిత తిరుపతయ్యకు రేవంత్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. దీంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ కావడంతో శనివారం సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షిల ఆధ్వర్యంలో గద్వాల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Also Read : Hathras stampede : తొలిసారి మీడియా ముందుకు భోలేబాబా.. హత్రాస్ ఘటనపై ఏమన్నారంటే?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ రావు, కాలే యాదయ్యలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిసైతం కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బండ్ల రాకతో మొత్తం ఏడుగురు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరినట్లయింది. మరోవైపు.. రెండు రోజుల క్రితం ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలుసైతం ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, త్వరలో వారి చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.