Gellu Srinivas Yadav: హుజురాబాద్‌ ఓటమికి నైతిక బాధ్యత నాదే -గెల్లు శ్రీనివాస్

పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్.

  • Updated on- January 20, 2022 / 03:59 PM IST

Gellu

Gellu Srinivas Yadav: పేదరికాన్ని చూడకుండా ఉద్యమంలో పనిచేశాననే ఒకే ఒక్క కారణంతో టిక్కెట్ ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్. తన కోసం పనిచేసిన పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపిన గెల్లు.. ఓటేసిన ఓటర్లకు పాదాభివందనం తెలియజేశారు. మరో రెండున్నరేళ్లలో మళ్ళీ ఎన్నికలు వస్తాయని, అప్పుడు గెలిచేది టీఆర్‌ఎస్ అని అన్నారు.

హుజురాబా‌ద్‌లో టీఆర్ఎస్ ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తానని గెల్లు శ్రీనివాస్ వెల్లడించారు. తనను ఓడించడానికి రెండు జాతీయ పార్టీలు ఏకమయ్యాయని అన్నారు. నైతికంగా హుజురాబాద్‌లో టీఆర్ఎస్ గెలిచిందని, హుజురాబాద్ టీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని మాట ఇచ్చారు గెల్లు శ్రీనివాస్.

హుజురాబాద్ అభివృద్ధికి పాటు పడుతానని చెప్పిన గెల్లు.. వచ్చే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయ్యడం ఖాయమన్నారు. ఈటెల గెలుపు కోసం.. కాంగ్రెస్ నాయకులే బల్మూరి వెంకట్‌ను బలిపశువు చేశారని అన్నారు. ఈటల రాజెందర్ గెలుపు కోసం కాంగ్రెస్ నేతలు పనిచేశారని, భవిష్యత్‌లో హుజూరాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానేనని అన్నారు.

గెలుపు ఓటములు సహజమని, గెలిచిన ఈటెల రాజేందర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. మంత్రి హరీష్‌రావుకు , గంగుల కమలాకర్ ,కొప్పుల ఈశ్వర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గెల్లు శ్రీనివాస్.