Ghmc Election : ముగిసిన నామినేషన్ల పర్వం
- madhu
- Updated on- November 21, 2020 / 08:24 AM IST
Ghmc Election, End of nominations : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. మూడు రోజుల పాటు కొనసాగిన నామినేషన్ల పర్వం ముగిసింది. బల్దియాలో 150 స్థానాలకు గానూ.. ఇప్పటి వరకు 1 వేయి 663 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు 2 వేల 226 నామినేషన్లు దాఖలయ్యాయి.
శుక్రవారం ఒక్క రోజే 1 వేయి 561 నామినేషన్లు నమోదయ్యాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి 493, బీజేపీ నుంచి 494, కాంగ్రెస్ నుంచి 312 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ 186, ఎంఐఎం 66, సీపీఎం 24, సీపీఐ 15 నామినేషన్లు దాఖలు చేశాయి. ఇతర పార్టీల నుంచి 86 నామినేషన్లు.. స్వతంత్ర అభ్యర్థులుగా 550 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అటు మొదటి రెండు రోజుల్లో 537 నామినేషన్లు వేశారు అభ్యర్ధులు.
ఆఖరి రోజు కావడంతో కార్యాలయాలు కిక్కిరిశాయి. అభ్యర్థులు భారీ ర్యాలీలతో తమ నామినేషన్లు ఎన్నికల అధికారులకు సమర్పించారు. మధ్యాహ్నం 3గంటల లోపు క్యూలో ఉన్నవారికి నామినేషన్ల వేసే అవకాశం కల్పించారు అధికారులు. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి నిమిషంలో టికెట్లు ఖరారు కావడంతో అభ్యర్థులు ఆగమేఘాల మీద నామినేషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది.
ఇక చివరి వరకు టికెట్ కోసం వెయిట్ చేసిన ఆశావహులు.. తమకు టికెట్లు కేటాయించకపోవడంతో రెబల్స్, స్వతంత్ర్య అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. బల్దియా ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఎన్నికల బరిలోకి దిగారు. ఇక శనివారం నామినేషన్ల పరిశీలన కొనసాగనుంది. ఆదివారం వరకు అభ్యర్థులు బీఫామ్లు సమర్పించే అవకాశం ఉంది.
