గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియలో కదలిక మొదలవగా.. నవంబర్ రెండో వారంలో 15వ తేదన షెడ్యూల్ విడుదల చేసి డిసెంబర్లో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఎన్నికల సంఘం.
తొలుత డిసెంబర్లో ఎన్నికలు నిర్వహిస్తారని భావించినా.. వర్షాలు, వరదలతో జనవరి ఆఖరు లేదా ఫిబ్రవరి మొదటి వారంలో ఉండే అవకాశం ఉందని అనుకున్నారు. కానీ అఖిలపక్ష నేతలతో జీహెచ్ఎంసీ భేటి అయ్యి ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని కూడా ఈసీ కోరింది.
ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి షెడ్యూల్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. జీహెచ్ఎంసీ చట్టానికి ఇటీవల చేసిన సవరణ మేరకు ప్రస్తుతం ఉన్న డివిజన్ల రిజర్వేషన్లను యథావిధిగా కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మహిళలకు 2016లో అమలైన 50 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత లభించగా.. ఈ మేరకు 150 డివిజన్లలో 75శాతం పూర్తిగా మహిళలకే కేటాయించే అవకాశం ఉంది. దీంతో ఈసారి మేయర్ పీఠం కూడా మహిళలకే కేటాయించే అవకాశం కనిపిస్తుంది.
2020 ఫిబ్రవరి ఓటర్ల జాబితానే ప్రామాణికంగానే తీసుకుని, కొత్త ఓటర్ల నమోదుకు నామినేషన్ల ముందురోజు వరకు అనుమతి ఇవ్వనున్నారు. ప్రస్తుత పాలకవర్గం గడువు 2021 ఫిబ్రవరి 10 వరకు ఉన్నా, 3 నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లి, కొత్త పాలకవర్గం కొలువుదీరేందుకు తాజా సవరణలు అనుమతి ఇస్తున్నాయి.