GHMC Fogging Scam
GHMC Fogging Scam: ఎన్ని ఆరోపణలు వచ్చినా..ఎన్నిసార్లు మీడియాలో రచ్చరంబోలా అయినా..ఆ నాలుగు రోజులు సైలెంట్ అయిపోతారు. ఆ తర్వాత ఎవరికి వారే రాజు. ఎవరికి వారే మంత్రి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా..ఎవరు అధికారంలో ఉన్నా..ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ బల్దియా కమిషనర్గా వచ్చిన తెరవెనుక దందా నడుస్తూనే ఉంది. సెట్రైట్ చేద్దామని వచ్చే అధికారిని సెట్ అయ్యేలోపే ట్రాన్స్ఫర్ చేస్తుంది సర్కార్. ఇక కొందరు అధికారులేమో తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నారట.
దీంతో కాంట్రాక్టర్లు, కిందిస్థాయి సిబ్బంది GHMCని ఏలుతున్నారట. ఏ రేంజ్లో అంటే దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్న అలిగేషన్స్ వెబ్ సిరీస్లను మించి ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తుంది. అయినా బాధ్యులెవరో తెలియదు. ఎవరి మీద యాక్షన్ తీసుకుంటారో అంతకంటే అర్థం కాదు. ఇలా ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా బల్దియా తీరు మారట్లేదు. అవినీతి ఆగట్లేదని జనమే విసిగిపోయిన పరిస్థితి. దోమల నియంత్రణ పేరుతో డీజిల్ స్కామ్ అయినా..మాన్ సూన్ టీమ్ల పేరుతో అడ్డగోలుగా కాంట్రాక్టులు అయినా..ఇవన్నీ చూసి జనం విసిగెత్తిపోయారన్న చర్చ జరుగుతోంది.
Also Read: టీడీపీలో రథసారథుల రేసు.. ఆ జిల్లాల బాస్లు ఎవరు?
ఫాగింగ్ పేరుతో డీజిల్ నొక్కేస్తున్నారని మరో స్కామ్ వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా అయితే బల్దియాలో ఇలా జరగడం కొత్తేమి కాదన్నచర్చ ఉంది. కాకపోతే ఈ సారి ఉద్యోగులే గొడవ పడి రచ్చకెక్కడంతో డీజిల్ పేరుతో కోట్లు స్వాహా చేస్తున్న స్టోరీ బయటికి వచ్చింది. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో ఫాగింగ్ కోసం ఉపయోగించాల్సిన డీజిల్ పక్కదారి పడుతుందంటూ కార్మికులు సీఎం ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది.
తమ సూపర్వైజర్ ప్రతిరోజూ ఇవ్వాల్సిన డీజిల్, పెట్రోలు పూర్తిస్థాయిలో ఇవ్వడం లేదని..అయినా మొత్తం డీజిల్, పెట్రోల్ ఇచ్చినట్లుగా తమతో సంతకాలు తీసుకుంటున్నాడని కిందిస్థాయి ఉద్యోగి ఒకరు ఫిర్యాదు చేశారు. కేవలం అటెండెన్స్ తీసుకొని మిగతా పనులు ఏం చేయించడం లేదని చెప్పుకొచ్చారు కార్మికులు.
మరోవైపు కార్మికులు సరిగ్గా పనిచేయట్లేదంటూ సదరు సూపర్వైజర్ GHMC కమిషనర్కు ఫిర్యాదు చేశారు. సర్కిల్ పరిధిలో పనిచేసే ఒక ఉద్యోగి ద్విచక్ర వాహనాల రికవరీ ఏజెంట్గా పని చేస్తూ ఇతర ఉద్యోగులను పనిచేయకుండా చేస్తున్నాడని సూపర్ వైజర్ కంప్లైంట్ ఇచ్చారు. (GHMC Fogging Scam)
కొంతమంది కార్మికులు నిబంధనల ప్రకారం పని చేయకుండా..పూర్తిస్థాయిలో మెటీరియల్ తీసుకోకుండా తన నుంచి డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ సూపర్ వైజర్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఫిర్యాదులు రావడంతో తాను కాలనీలకు వెళ్లి ఎంక్వయిరీ చేస్తే ఫాగింగ్ చేయడానికి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తేలిందని ఫిర్యాదు చేశారు. ఇలా వర్కర్లపై సూపర్వైజర్, సూపర్వైజర్పై వర్కర్లు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకోవడంతో ఎంక్వయిరీకి ఆదేశించామంటున్నారు మలేరియా విభాగం అధికారులు.
ఇక GHMCలో ఫాగింగ్ చేయడానికి ప్రతీ ఏటా 10 నుంచి 12 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది ఎంటమాలజీ విభాగం. ఉద్యోగుల జీతాలు, ఇతర సదుపాయాలు అన్నీ కలిపి ప్రతి ఏటా 25 నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఫాగింగ్ పేరుతో జరిగే పనుల్లో 25 నుంచి 30% వరకు నిధులు ఖర్చు కావడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అవి పక్కదారి పడుతున్నాయని నిత్యం ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తుంటాయి. ప్రతి కౌన్సిల్ సమావేశంలోనూ కార్పొరేటర్లు దోమల నియంత్రణ సక్రమంగా జరగడంలేదని ఫాగింగ్ పనులు కావడం లేదంటూ ఆరోపిస్తుంటారు. కొన్ని సర్కిళ్ల పరిధిలో అక్రమాలు ఆగడం లేదనడానికి ఈ ఫిర్యాదులే ఎగ్జాంపుల్. మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో వచ్చిన ఫిర్యాదులపై అక్రమాలను నిగ్గు తేల్చే పనిలో పడ్డారు GHMC అధికారులు. ఇప్పటికే విజిలెన్స్ విభాగం ఈ అంశంపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.
త్వరలో అన్ని వివరాలు బయటికి వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు చెబుతున్న మాట. ఆరోపణలు వచ్చిన ప్రతీసారి ఎంక్వైరీలు, విచారణలు..కామన్ అయిపోయాయి. కానీ యాక్షన్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ మధ్యే లంగర్ హౌజ్ ప్రాంతంలో రూల్స్కు విరుద్దంగా మనుషులతో గుర్రపు డెక్కలను తొలగించే పనులు చేశారు ఎంటమాలజీ అధికారులు.
ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు తండ్రీ కొడుకులు నీటిలో మునిగి చనిపోగా..ఇందులో కుమారుడు మైనర్ కావడం తీవ్ర విమర్శల పాలైంది. ఈ సంఘటనపై కూడా ఇప్పటివరకు సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం బల్దియా నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇలా ఏ ఒక్క అధికారి మీద, కాంట్రాక్టర్ మీద సీరియస్ యాక్షన్ తీసుకోకపోవడం వల్లే బల్దియాలో అవినీతి నగరమేలుతోందన్న అలిగేషన్స్ ఉన్నాయి. ఈ సారైనా చర్యలు తీసుకుంటారా.? లేక షరా మామూలే అన్నట్లుగా వదిలేస్తారా అనేది చూడాలి మరి.