కాంగ్రెస్ ప్రభుత్వం హిట్ లిస్టులో ఆ ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? వ్యూహం మార్చిన సీఎం రేవంత్..

సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో.... ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను టచ్ చేసే అవకాశం లేదంటున్నారు.

Gossip Garage : సామ దాన భేద దండోపాయాలు… భారతంలో చెప్పిన రాజనీతి సిద్ధాంతం… యుద్ధంలో పైచేయి సాధించేందుకు పాటించే యుద్ధ నీతే సామ, దాన, భేద, దండోపాయం. ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ రాజనీతినే ప్రయోగించాలని చూస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఇన్నాళ్లు సామరస్యంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి… అది అనుకున్న రీతిలో సాగకపోవడంతో రూట్ మార్చారా…? 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కారు దింపేసి… కాంగ్రెస్ లో విలీనం చేసేద్దాం అనుకున్న వ్యూహం వర్కవుట్ కాకపోవడంతో మరో ఎత్తు వేస్తున్నారా…? బుజ్జగింపులను పక్కనపెట్టి ఇక కొరడా ఝుళిపించాలని చూస్తున్నారా? అసెంబ్లీలో సీఎం హెచ్చరికలను పరిశీలిస్తే…. భారతంలో చెప్పిన రాజ తంత్రాన్నే రేవంత్ ప్రయోగించాలని భావిస్తున్నట్లు కన్పిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు… .

దారికి రాని ఎమ్మెల్యేలపై దండోపాయం ప్రయోగం?
ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వల వేసిన కాంగ్రెస్.. దారికి రాని ఎమ్మెల్యేలపై దండోపాయం ప్రయోగించాలని చూస్తుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెంబ్లీ లోపల.. బయట.. తమకు చికాకులు సృష్టిస్తున్న గులాబీదళంపై కొరడా ఝుళిపిస్తే…. అటు.. ఇటు.. ఊగిసలాటలో ఉన్న వాళ్లను ఆకర్షించొచ్చేనే నయా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు. ముఖ్యంగా గత వారం ముగిసిన అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరికలను పరిశీలిస్తే… కాంగ్రెస్ వ్యూహం ఏంటో తెలుస్తోందంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్… మాజీ సీఎం కేసీఆర్ చూపిన తోవలోనే నడుచుకుంటున్నట్లు సంకేతాలు పంపుతోంది.

కేసీఆర్‌నే ఫాలో అయ్యేలా ప్లాన్..
ఇక దారికి రాని వారి విషయంలోనూ కేసీఆర్‌నే ఫాలో అయ్యేలా నువ్వు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లు…. అసెంబ్లీలో దూకుడుగా వ్యవహరిస్తున్న ముగ్గురు ఎమ్మెల్యేలపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ విషయం దాచుకోకుండా…. ఒకరిద్దరిపై అనర్హత వేటు వేస్తే… ఇంకెవరూ స్పీకర్ పోడియం వద్దకు రారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఇలా వ్యాఖ్యానించడంతో బీఆర్ఎస్ సభ్యులు అలర్ట్ అయ్యారంటున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ వాయిదా పడటంతో గులాబీ ఎమ్మెల్యేలు గండం నుంచి గట్టెక్కారంటున్నారు.

2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు..
2018 ఎన్నికలకు ముందు అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సంపత్‌కుమార్‌పై అనర్హత వేటు వేశారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఈ ఇద్దరూ శాసనసభ సమావేశాలకు అడ్డుగా ఉంటున్నారని, క్రమశిక్షణ అతిక్రమిస్తున్నట్టు అభియోగం మోపుతూ ఎమ్మెల్యే సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించారు. ఆ తర్వాత వారిద్దరూ కోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయింది. ఐతే అప్పట్లో ఎన్నికలు సమీపించడంతో కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ ప్రాతినిధ్యం వహించిన స్థానాలకు ఉప ఎన్నికలు రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ వారిపై వేసిన అనర్హత వేటు సానుభూతి లేకుండా పోయింది. ఆ విషయాన్ని ప్రజలు కూడా పట్టించుకోకుండా కోమటిరెడ్డి, సంపత్ లను ఓడించి.. కేసీఆర్ సర్కార్ పట్లే తమ విశ్వాసం ప్రకటించారు. దీంతో అప్పటి కేసీఆర్ స్ట్రాటజీనే ఇప్పుడు రేవంత్ కూడా ఫాలో అయ్యేందుకు స్కెచ్ వేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

ప్రతిపక్షానికి గట్టి మెసేజ్ పంపాలనే ఉద్దేశ్యం..
అయితే ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభ్యులపై వేటు పడితే ఉప ఎన్నికలు జరిగే చాన్స్ ఉంది. దీంతో ఉప ఎన్నికలను ఎదుర్కోవడంతో పాటు… ముగ్గురు ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరిస్తే తలెత్తే రాజకీయ పరిణామాలను విశ్లేషస్తుందంటున్నారు. ముందుగా తమ దారికి రాని ఎమ్మెల్యేలకు ఓ హెచ్చరిక పంపడంతోపాటు… సభా వ్యవహారాల్లో కఠినంగా వ్యవహరిస్తామని ప్రతిపక్షానికి గట్టి మెసేజ్ పంపాలనే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్ అలాంటి వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరు?
సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో…. ప్రభుత్వం హిట్‌లిస్టులో ఉన్న గులాబీ ఎమ్మెల్యేలు ఎవరన్న చర్చ జరుగుతోంది. 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 10 మంది కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక మిగిలిన వారిలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులను టచ్ చేసే అవకాశం లేదంటున్నారు. ప్రధానంగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న ముగ్గురు నేతలపైనే కాంగ్రెస్ ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. ఈ హిట్‌లిస్టులో హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ ముగ్గురిపై అనర్హత వేటు వేస్తే ఎదురయ్యే పరిణామాలపై ఆరా తీస్తున్నట్లు చెబుతున్నారు.

ఫస్ట్ టార్గెట్ కౌశిక్ రెడ్డి..!
గులాబీ పార్టీలో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఈ మధ్య ఎక్కువ హడావుడి చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌తోపాటు సీఎం రేవంత్‌రెడ్డిపైనా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక బ్లాక్ బుక్ పేరిట ప్రభుత్వం, అధికారుల తప్పులను నమోదు చేస్తున్నానని చెబుతున్న కౌశిక్‌రెడ్డి…. అసెంబ్లీలో ప్రభుత్వంతో తీవ్ర స్థాయిలో ఫైట్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లోని ఓ సీనియర్ నేతకు ఆయనతో సత్సంబంధాలు ఉండటం కూడా… కౌశిక్‌రెడ్డి హిట్‌ లిస్టులోకి వెళ్లడానికి కారణమంటున్నారు. కౌశిక్‌రెడ్డిపై వేటు పడితే ఇటు స్వపక్షంలోనూ… అటు విపక్షంలోనూ ప్రత్యర్థులకు గట్టి మెసేజ్ పంపినట్లు అవుతుందని చెబుతున్నారు.

కేసీఆర్ దారిలోనే వెళ్లి బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి ప్లాన్..!
ఇక బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సన్నిహితులు. ఈ ఇద్దరిపై వేటు వేసి ఆ ఇద్దరికి చెక్ చెప్పాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్… కేటీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉంటారు. ఎమ్మెల్యే సంజయ్‌ను అనర్హుడిగా ప్రకటిస్తే…. మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆటోమెటిక్ గా తమ దారికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు కాంగ్రెస్ భావిస్తోంది. 2018లో కోమటిరెడ్డి.. సంపత్‌పై ఇలా వేటు వేయడం వల్లే… ఆ తర్వాత ఏర్పడిన కేసీఆర్ రెండో విడత సర్కార్ లో చేరికలకు ఎక్కువ సమయం తీసుకోలేదని అంటున్నారు. ఇప్పుడు తాము కూడా కేసీఆర్ దారిలోనే వెళ్లి…. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకోవాలనే తమ పంతాన్ని నెగ్గించుకోవాలని వ్యూహం రచిస్తున్నట్లు చెబుతున్నారు.

Also Read : అసెంబ్లీలో దానం నాగేందర్ విశ్వరూపం వెనుక పెద్ద స్కెచ్..!

ట్రెండింగ్ వార్తలు