×
Ad

Telangana Congress: జంపింగ్‌లకే పెద్దపీట..! ఆ రెండు చోట్ల ఇంచార్జ్‌లకు ఝలక్ ఇచ్చిన కాంగ్రెస్..! ఎందుకిలా..

దీంతో ఈ రెండు చోట్ల రెబల్స్ బెడదతో ఏమైనా తేడా కొడుతోందా అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నేతల తీరుపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట.

  • Published On : February 6, 2026 / 06:00 AM IST

Jeevan Reddy Representative Image (Image Credit To Original Source)

  • జగిత్యాల, గద్వాల్‌లో జంపింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ
  • జీవన్‌రెడ్డి, సరితా తిరుపతయ్య వర్గానికి దక్కని టికెట్‌లు..!
  • తమ అనుచరులను స్వతంత్రులుగా బరిలోకి దింపిన నేతలు

Telangana Congress: జంపింగ్‌ ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఆ రెండు చోట్ల సీనే వేరు. రెండేళ్ల నుంచి ఉన్న వైరం..పురపోరు వేళ ఇంకా రాజుకుంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, నియోజకవర్గ ఇంచార్జ్‌లకు హ్యాండ్‌ ఇచ్చి..ఆ ఇద్దరు జంపింగ్‌ ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇచ్చింది హస్తం పార్టీ. తమ అనుచరులకు టికెట్ దక్కలేదన్న కోపంతో..అసంతృప్త నేతలు సరికొత్త ఎత్తులు వేస్తున్నారట. ఏకంగా తమ అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపిన నేతలు..రివేంజ్ పొలిటికల్‌ గేమ్ స్టార్ట్ చేశారు. ఆ రెండు చోట్ల నేతల మధ్య రాజీ ఎందుకు కుదరలేదు? జంపింగ్‌ ఎమ్మెల్యేల మాటే నెగ్గడం వెనుక జరిగిందేంటి?

మున్సిపల్ ఎన్నికల వేళ జగిత్యాల, గద్వాల్‌ కాంగ్రెస్‌లో రచ్చ నెక్స్ట్ లెవల్‌కు చేరుకుంది. కొత్త, పాత నేతల మధ్య టికెట్ల కేటాయింపులో చెప్పింది ఒక్కటి..చేసింది మరొకటి అన్నట్లుగా..నియోజకవర్గ ఇంచార్జ్‌లకు ఝలక్‌ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. గాంధీభవన్ వేదికగా వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి మూమెంట్‌ను..సీట్ల కేటాయింపుతో పాటు ప్రచార శైలిని..కీన్‌గా అబ్జర్వ్‌ చేస్తున్న కాంగ్రెస్ పెద్దలు..జగిత్యాల, గద్వాల జగడంపై తలలు పట్టుకుంటున్నారట.
కొలిక్కి రాని గ్రూప్ తగాదాలు..

ఈ రెండు చోట్ల పార్టీ నేతల మధ్య ఉన్న గ్రూప్ తగాదాలు ఎంతకీ కొలిక్కి రాకపోవడంతో..వర్గపోరు ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన చెందుతున్నారట. జగిత్యాలలో మాజీమంత్రి జీవన్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య వర్గపోరు నడుస్తోంది. గద్వాల్‌లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వర్సెస్ సరిత తిరుపతయ్య మధ్య గ్రూప్‌వార్‌ రోజు రోజుకు ముదురుతూ వచ్చింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల వేళ పీక్స్‌కు చేరి..ఫైనల్‌గా తమ సత్తా ఏంటో చూపిస్తామంటూ శపథం చేసే స్థాయికి చేరింది.

జీవన్ రెడ్డికి అధిష్టానం ఝలక్..

మున్సిపల్‌ ఎన్నికల్లో..మెజారిటీ బీఫామ్‌లు దక్కించుకోవాలని జగిత్యాలలో జీవన్ రెడ్డి, గద్వాల్‌లో సరితా తిరుపతయ్య మొదటి నుంచి శతవిధాల ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరు నేతలకు చివరికి నిరాశే ఎదురైంది. జగిత్యాల నియోజకవర్గంలో 50 మున్సిపల్ వార్డులుంటే..ఇందులో మెజారిటీ స్థానాలు తన అనుచరులకే ఇవ్వాలని ఆఖరి నిమిషం వరకు పట్టుబట్టారు జీవన్ రెడ్డి. పార్టీ మారి వచ్చిన ఎమ్మెల్యేకు కాకుండా..పార్టీని నమ్ముకొని ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వాలని కాంప్రమైజ్‌ కాకుండా పార్టీ పెద్దలతో ఫైట్ చేశారు. కానీ పరిస్థితి చేయి దాటుతుండటంతో..ఆఖరికి కనీసం ఫిఫ్టీ..చెరి సగం సీట్లు అయినా ఇవ్వాలని కోరారట. కానీ జీవన్ రెడ్డి ఆశలు నెరవేరలేదు. జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు, ఎమ్మెల్యే సంజయ్‌కి 30 సీట్లు కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం ఝలక్ ఇచ్చింది.

గద్వాల్ లో సరితాకు ఊహించని షాక్..

ఇక గద్వాల్‌లో కూడా సరితా తిరుపతయ్యకు సేమ్ ఇలాంటి సిచువేషన్ ఏర్పడింది. గద్వాల్‌లో 37 డివిజన్లు ఉంటే ఇందులో మొదట ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి 20 డివిజన్లు, సరితా తిరుపతయ్యకు 17 డివిజన్లు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ముఖ్యనేతల జోక్యంతో పరిస్థితి మారిపోయింది. ఫైనల్‌గా సరితకు 7 సీట్లు..ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి వర్గానికి 30 స్థానాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే..సరితా తిరుపతయ్య వర్గానికి ఇస్తామన్న ఏడు సీట్లలో కూడా బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ ఏడు సీట్ల బీఫామ్‌లను కూడా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎగురేసుకుపోయారు. దీంతో సరితాకు ఊహించని షాక్‌ తగిలింది.

పార్టీ ఇచ్చిన షాక్‌తో తీవ్ర అసంతృప్తికి గురైన ఆ ఇద్దరు నేతలు..రివేంజ్ పాలిటిక్స్‌కు తెరలేపారట. గద్వాల్ సరితా తిరుపతయ్య..కాంగ్రెస్ పార్టీ తీరుపై చాలా సీరియస్‌గా ఉన్నారట. పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని..రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే..నేతలు మాత్రం అందుకు విరుద్ధంగా నడుచుకుంటున్నారని మండిపడ్డారు. తన వర్గానికి ఏడు డివిజన్లలో టికెట్లు ఇస్తామని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఏడు డివిజన్లలో తన అభ్యర్థులను బరిలో దింపి గెలిపించుకుంటానని శపథం చేస్తున్నారామె.

ఇక జగిత్యాలలో జీవన్ రెడ్డి అయితే ఔట్‌ రైట్‌గా ఫీల్డ్‌లోకి దిగారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా బరిలోకి దిగిన తన అనుచరులకు మద్దతుగా ప్రచారం చేశారు. 33, 16 వార్డులో ఇండిపెండెంట్‌ క్యాండిడేట్స్‌ గెలుపు కోసం ప్రచారం చేసిన జీవన్‌రెడ్డి..వలసదారులు కాంగ్రెస్ గుర్తును దొంగిలించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గుర్తుతో సంబంధం లేకుండా పని చేసే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. జగిత్యాలలో మెజారిటీ స్థానాల్లో తన మనుషులను బరిలో నిలిపిన ఆయన..ఎలాగైనా పైచేయి సాధించేందుకు రంగంలోకి దిగారు.

దీంతో ఈ రెండు చోట్ల రెబల్స్ బెడదతో ఏమైనా తేడా కొడుతోందా అని పార్టీ పెద్దలు ఆందోళన చెందుతున్నారట. ఈ ఇద్దరు నేతల తీరుపై పార్టీ నేతలు కూడా గుర్రుగా ఉన్నారట. ఈ వ్యవహారం ఎటువైపుకు దారి తీస్తుందోనన్న గుబులు హస్తం లీడర్లను వెంటాడుతోందట.

Also Read: మున్సిపల్ ఎన్నికలు.. బీఆర్ఎస్ లైట్ తీసుకుందా? గులాబీ పార్టీలో స్తబ్ధతకు కారణం ఏంటి?