School
Online Classes: కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా కరోనా కారణంగా విద్యారంగం పూర్తిగా తెరుచుకునే పరిస్థితి లేదు. రాబోయే రోజుల్లోనూ పరిస్థితి ఎలా ఉంటుందో తెలియట్లేదు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తెరుచుకునేందుకు సిద్ధం అవ్వగా.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఆన్లైన్ తరగతులు ఉండవని, కేవలం ప్రత్యక్ష బోధనే ఉండాలని ప్రభుత్వం అంతర్గతంగా నిర్ణయం తీసుకుంది. కొన్ని ప్రైవేటు స్కూళ్లు ఆన్లైన్ టీచింగ్ కోసం పర్మీషన్ అడిగినప్పటికీ కుదరదు అని చెప్పేస్తుంది ప్రభుత్వం. ఆన్లైన్లో చెప్పకూడదూ అంటూ ఉత్తర్వులు మాత్రం ఇప్పటివరకు ఇవ్వలేదు ప్రభుత్వం. ప్రభుత్వం ఇచ్చిన జీఓలో, పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేయట్లేదు ప్రభుత్వం.
ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభం అంటే ఆన్లైన్ ఉండదనే కదా? అర్థం అని అంటున్నారు అధికారులు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నీ తెరిచి పాఠాలు చెప్పాల్సిందే అని, ఆఫ్ లైన్లోనే విద్యా బోధన జరగాలని స్పష్టం చేసింది ప్రభుత్వం. ఆన్లైన్ తరగతుల నిర్వహణకు అవకాశం లేదని వెల్లడించింది. సెప్టెంబర్ 1 నుంచి పాఠశాలలు తెరుచుకోవాల్సి ఉండడంతో.. ప్రైవేటు యాజమాన్యాలన్నీ బిజీబిజీగా ఉన్నాయి.
ఇప్పటికే ఎన్నో రోజుల నుంచి పాఠశాలలు నిర్మానుష్యంగా ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లోనూ శుద్ధి చేస్తున్నారు అధికారులు. విద్యాసంస్థలు తెరవాలని సర్కారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ, బడికి వెళ్లని విద్యార్థుల పాఠాల సంగతి ఏంటీ? అన్నదానిపై స్పష్టత లేదు. వాళ్లు చదువు మానేయాలా? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఇంకోవైపు.. కరోనా కేసులు పెరిగితే ఏం చేయాలన్నదానిపై విద్యాశాఖ ఏం చెప్పిందంటే.. కేసులు ఎక్కువైన పాఠశాలను మూసేయాలని చెప్పింది. ఇదే జరిగితే.. ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్ ఏమిటి? రాష్ట్రంలోని మిగిలిన విద్యార్థులంతా చదువుకుంటుంటే.. వీళ్లు మాత్రం చదువుకు దూరం కావాలా? అనే సందేహం వ్యక్తమవుతోంది. ఇలా.. పలు సందేహాలు ఉన్నాయి. మరి, వీటికి ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెబుతుందన్నది చూడాలి.