Governor Tamilisai : ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభలో గవర్నర్ల వ్యవస్థపై ముఖ్యమంత్రలు చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ గవర్నర్ తమిళిసై కౌంటర్ ఇచ్చారు. సీఎంలుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు. గవర్నర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ అవమానించారని వాపోయారు. ఏడాది నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదన్నారు. తెలంగాణలో ఎందుకు ప్రోటోకాల్ పాటించడం లేదని నిలదీశారు.
గవర్నర్లపై ఎందుకింత చిన్నచూపని ఆమె ప్రశ్నించారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాక అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతానని తెలిపారు. రిపబ్లిక్ డే, బడ్జెట్ సమావేశాలు రానున్నాయని పేర్కొన్నారు. రిపబ్లిక్ డేపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాచాం రాలేదని తెలిపారు. ప్రభుత్వం తీరు ఎలా ఉంటుందో చూడాలన్నారు. ముఖ్యమంత్రులుగా ఉండి గవర్నర్ వ్యవస్థను ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు.
తానూ 25 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ప్రోటో కాల్ ఎలా అనేది తనకు తెలుసన్నారు. తన కార్యాలయంలో బిల్లులు పెండింగ్ లో ఉన్న మాట వాస్తవమేనని అన్నారు. బిల్లుల కంటే ప్రోటో కాల్ అంశం ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉందని చెప్పారు. ప్రోటోకాల్ అంశంపై సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు.