Haritha Haram : తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన హరితహారం కార్యక్రమంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల మొక్కలు నాటుతున్నారు. అయితే తాజాగా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను నరికివేయించిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మోత్కులకుంట తండాలో చోటు చేసుకుంది. మోత్కులకుంట తండా పంచాయతీలో రాజాపూర్కు చెందిన మాజీ పోలీసు అధికారి బోయ సాయన్నకు ప్రభుత్వం గతంలో మూడెకరాల భూమిని కేటాయించింది.
అయితే ఆయనకి కేటాయించిన భూమిలో హరితహారం పేరిట మూడేళ్ల కిందట పల్లె ప్రకృతివనాన్ని మండల అధికారులు, ప్రజాప్రతినిధులు కలిసి ఏర్పాటు చేశారు. పల్లె ప్రకృతివనం ఏర్పాటు కోసం కోల్పోయిన మేరకు ఆ భూమిని మరోచోట చూపిస్తామని సాయన్నకి అధికారులు అప్పట్లో హామీ ఇచ్చారు. దీంతో తనకు భూమి కేటాయించాలని, లేదంటే తన భూమిలో ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాన్ని తీయించాలని సాయన్న గత కొన్ని రోజులుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.
Food poision : షవర్మా తిని ఒకరు మృతి.. 18 మంది ఆసుపత్రిలో..
తాజాగా ఆదివారం ఆయన తహసీల్దార్ అనుమతి ఇచ్చారని చెప్పి కూలీలతో హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన ఆ ప్రకృతివనంలో నాటిన దాదాపు 110 మొక్కలను గొడ్డలితో నరికించారు. దాని చుట్టూ ప్రహరీగా ఏర్పాటుచేసిన కడీలను విరగ్గొట్టారు. ఇది తెలుసుకున్న ఆ గ్రామ సర్పంచ్ రవినాయక్ అక్కడికి చేరుకొని మొక్కలను నరకొద్దని కూలీలను వెనక్కి పంపించేశారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు చేరుకొని సాయన్నని ప్రశ్నించగా తహసీల్దార్ తన భూమిలో ఉన్న మొక్కలు తీసివేసేందుకు అనుమతి ఇవ్వడం వల్లే నేను కూలీలతో నరికించానని చెప్పాడు. తహసీల్దార్ శంకర్ని ప్రశ్నించగా సాయన్న భూమిలో కొందరు రైతులు వేసిన గడ్డివాములు, పిచ్చిమొక్కలను తొలగించుకోవచ్చని చెప్పాను, అంతేకాని హరితహారంలో నాటిన మొక్కలని తొలగించుకోవచ్చని నేను చెప్పలేదు అన్నారు. ఈ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ప్రస్తుతం సాయన్నపై పోలీసు కేసు నమోదు చేశారు.